ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ...వైసీపీ ఆందోళనను ఉదృతం చేసింది. మండల, జిల్లా స్థాయిల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఆ పార్టీ...కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చి సంచలనం సృష్టించింది. దీంతో వైసీపీ దారిలోనే మిగతా పార్టీలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పదే పదే అవిశ్వాసంపై చర్చను తిరస్కరించడంతో ఏడోసారి నోటీసు ఇచ్చిన వైసీపీ...రాజీనామాలపై కీలక నిర్ణయం తీసుకుంది.
పార్లమెంట్ సమావేశాల్లో నేడు ఏం జరుగుతుందన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైసీపీ ముందు నుంచి ఆందోళన చేస్తోంది. హోదాకు సమానమైన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న కేంద్రం నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ ఒకే చెప్పినా వైసీపీ మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టింది. ప్రత్యేక హోదా మండల, జిల్లా స్థాయిల్లో రకరకాలు నిరసనలు వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ లోక్సభలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. వైసీపీకి మద్దతు ఇస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ తర్వాత రాత్రికిరాత్రే నిర్ణయం మార్చుకుంది. అయినప్పటికీ వైసీపీ వెనక్కి తగ్గకుండా అవిశ్వాసం తీర్మానం పెట్టి రాజకీయాల్లో వేడి పుట్టించింది.
గుంటూరు జిల్లా ముప్పాళ్లలో జగన్తో సమావేశమైన వైసీపీ ఎంపీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హోదాపై చర్చించకుండా లోక్సభ నిరవధిక వాయిదా పడిన వెంటనే రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు తమతో కలిసి వచ్చి రాజీనామా చేస్తే కేంద్రం ఒత్తిడి పెరుగుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మోడి గ్రాఫ్ పడిపోవడంతోనే చంద్రబాబు ఎన్డీఎ నుంచి బయటకు వచ్చారని చెప్పారు మేకపాటి.
మరోవైపు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ స్పీకర్కు వరుసగా ఆరు రోజులు వైసీపీ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. అయితే ఏ ఒక్క రోజు కూడా నో కాన్పిడెన్స్ మోషన్పై చర్చించేందుకు స్పీకర్ ఆసక్తి చూపలేదు. ఏపీ ఎంపీలు అవిశ్వాసంపై చర్చించాలని డిమాండ్ చేయడంతో ఆర్డర్లో లేదంటూ వాయిదా వేస్తూ వస్తున్నారు సుమిత్రా మహాజన్. దీంతో ఏడోసారి ఆ పార్టీ ఎంపీ సుబ్బారెడ్డి అవిశ్వాస నోటీసు ఇచ్చారు.