జనసేన అధినేత యాక్షన్ ప్లాన్ ఏంటి? పొలిటికల్ స్ట్రాటజెస్ స్టార్ట్ చేసినట్టేనా? ఏపీలో పాలక, ప్రతిపక్షాలు అవిశ్వాసమంటూ కేంద్రంపై యుద్ధం ప్రకటించాయి. మరి పవన్కల్యాణ్ ఆలోచన ఏంటి? ఏపీలో నిలిచి గెలవాలంటే... ఏం చేయాలి? ఏం చేస్తున్నారు.?
పవన్కల్యాణ్ యాక్షన్ ప్లాన్ ఏంటి..రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారా..అవిశ్వాసంపై పాలక, ప్రతిపక్షాలకు మద్దతు పలుకుతారా..ఢిల్లీలో విపక్షాల పెద్దలను కలసి సంఘీభావానికి పట్టుపడుతారా?
కొత్త తరహా రాజకీయ సంస్కృతికి జనసేన అర్థం చెబుతుంటారు పవన్ కల్యాణ్. ఇక పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాలు మొదలు పెడుతానన్న జనసేనాధిపతి ఇప్పుడిప్పుడే తన వ్యూహాలకు పదనుపెడుతున్నారా? క్రమక్రమంగా ఏపీ రాజకీయాలపై పట్టు సాధిస్తున్నారా?
భిన్నమైన రాజకీయ సంస్కృతికి నాంది పలుకుతానంటున్న పవన్- రాజకీయ పార్టీగా జనసేన నిలబడాలనుకుంటే ఏం చేయాలో దాని కార్యాచరణ మొదలుపెట్టారని చెబుతున్నారు జనసేన కార్యకర్తలు. నిన్నామొన్నటి వరకూ తెలుగుదేశంపై ఎలాంటి విమర్శలు ఎక్కుపెట్టని జనసేనాని ఎవరూ ఊహించని విధంగా టీడీపీని టార్గెట్ చేయడం రాజకీయంగా అందరిని షాక్కు గురిచేసింది. ఎప్పుడు సభలు పెట్టినా.. వైసీపీ లేదంటే బీజేపీపై సెటైర్లు వేసే సేనాని ఈసారి రూట్ మార్చి రెచ్చిపోయారు. అవినీతి ఆరోపణలకు టీడీపీ కేరాఫ్ అడ్రస్గా మారిందంటూ భగ్గుమన్నారు.
ఇప్పటివరకు తెలుగుదేశానికి మద్దతుగా నిలుస్తూ వచ్చారు పవన్కల్యాణ్. అందుకే జనసేనానిని టీడీపీ పార్ట్నర్ అంటూ విపక్షం టార్గెట్ చేసింది. అయితే దీన్ని తిప్పికొట్టేందుకు ఇక నుంచి తామే ప్రతిపక్షం అన్నట్టు ఫోకస్ చేయడానికి పవన్ యాక్షన్ ప్లాన్కు పదును పెట్టారన్నది విశ్లేషకుల మాట. ఇవన్నీ సరే మరి అధికార, ప్రతిపక్షాలు ఇచ్చే అవిశ్వాసంలో పవన్ పాత్రేంటి?
అవిశ్వాసం యుద్ధంలో పవన్ చిత్తశుద్ధి ఎంత..అప్పుడు అవిశ్వాసం పెట్టండి... మీ వెంటే నేను అన్నారు..ఇప్పుడు ఇంత రగులుతున్నా... పవన్ ఎందుకు మాట్లాడట్లేదు?
దమ్ముంటే కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం పెట్టండి అవసరమైన మద్దతు తాను తీసుకువస్తానన్న పవన్ ఇప్పుడు మాటెత్తడం లేదంటోంది రాజకీయం. ఏదో ఆ సందర్భానికి అప్పట్లో నాలుగు డైలాగులు వల్లించిన పవన్ ఇప్పుడు ఆ వ్యవహారంతో తనకేమీ ప్రమేయమే లేనట్టుగా ఆ ఊసే ఎత్తకుండా అమరావతిలో కూర్చుని రాజకీయ వ్యూహరచన చేసుకుంటున్నారని విమర్శిస్తోంది.
కేంద్రంపై అవిశ్వాసం పెడితే కదలిక వస్తుందని ఎన్నో సార్లు చెప్పారు జనసేనాని. ఉన్న మాట చెప్పాలంటే వాస్తవం మాట్లాడాలంటే ఆ ఆలోచన కలిగించింది కూడా పవన్కల్యాణే. దమ్ముంటే మీరు పెట్టండి అన్న మాటను సీరియస్గా తీసుకున్న వైసీపీ నోటీస్ ఇస్తే టీడీపీ కూడా ఇప్పుడూ సై అంటోంది. కానీ ఇప్పుడు పవన్కల్యాణ్ ఎందుకు మడతపేచీ పెడుతున్నారని ప్రశ్నిస్తున్తనారు ఏపీ నేతలు.
అవిశ్వాసానికి సిద్ధమైతే ఢిల్లీలో కూర్చొనైనా... విపక్షాలు, ఎన్డీయేతరుల మద్దతు కూడగడుతానన్న పవన్కల్యాణ్ ఇప్పుడు కనీసం ఆ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం లేదంటున్నారు ఏపీ ప్రజలు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరితో కలిసి పోరాడే వైఖరి అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.