నిజామాబాద్ జిల్లాలో విషాదం

Update: 2017-12-23 11:32 GMT

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామంలోని శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఓ యువతి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీన్ని గమనించిన భక్తులు.. యువతిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతిచెందింది. దీంతో బడా భీంగల్ గ్రామంలో విషాదం నెలకొంది. 

బడా భీంగల్ గ్రామానికి చెందిన తోట రాజమణి ఉదయం.. శ్రీరాజరాజేశ్వరి ఆలయానికి వెళ్లింది. భక్తుల తాకిడి తక్కువగా ఉండడంతో రాజమణిని ఎవరూ గమనించలేదు. పూజారి కూడా ఆలయ ప్రాంగణంలో పూలు కోసుకురావడానికి చెట్టు వద్దకు వెళ్ళాడు. అదే అదనుగా భావించిన రాజమణి గర్భ గుడిలోకి వెళ్ళి.. తలుపులు వేసుకుంది. తనవెంట డబ్బాలో తెచ్చుకున్న కిరోసిన్ ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. మంటల బాధను తట్టుకోలేక.. గట్టిగా అరవడంతో సమీపంలో ఉన్న అయ్యప్ప స్వాములు అప్రమత్తమై పరుగున ఆలయానికి చేరుకుని  మంటలను ఆర్పారు. అప్పటికే 80శాతానికిపైగా కాలిన గాయాలతో ఉన్న రాజమణిని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందూ రాజమణి మృతి చెందింది. డిగ్రీ చదివి,  టైలరింగ్ కూడా నేర్చుకున్న రాజమణి జీవితంపై విరక్తితోనే శివుని సన్నిధిలో ప్రాణాలు తీసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. రోజు తమ కళ్ల ఎదుటే తిరిగే రాజమణి ఇలా గుడిలో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం గ్రామస్తులను తీవ్రంగా కలచి వేసింది. ఈ సంఘటనతో ఆలయంలో పూజలు నిలిపివేసి, గర్భగుడిని మూసేసారు.
 పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Similar News