నెల్లూరు కార్పొరేషన్ మేయర్ అబ్దుల్ అజీజ్కు చెందిన స్టార్ అగ్రో మెరైన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సంస్థ దివాళా తీసింది. స్టార్ అగ్రో సంస్థ దివాళా తీసినట్లు నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ సంస్థ ప్రకటించింది. దీంతో అబ్దుల్ అజీజ్ కంపెనీ ఆర్థిక వ్యవహరాలు హాట్ టాపిక్గా మారాయ్.
నెల్లూరు కార్పొరేషన్ మేయర్ అబ్దుల్ అజీజ్కు చెందిన స్టార్ అగ్రో సంస్థ దివాళా తీసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 270 కోట్లు బకాయిలు పడటంతో బ్యాంక్ ప్రతినిధులు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. దీంతో స్టార్ అగ్రో దివాళా తీసినట్లు ప్రకటిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ రిసీవర్ను నియమించింది. ప్రసాద్ జంపెక్స్ ఆర్థిక వ్యవహారాలతో స్టార్ అగ్రో బండారం బట్టబయలైంది. స్టార్ అగ్రో సంస్థకు మేయర్ అబ్దుల్ అజీజ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.
ప్రసాద్ జంపెక్స్ రెండేళ్ల క్రితం రొయ్యల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. కంపెనీ కొనుగోలు చేసిన రొయ్యలను స్టార్ అగ్రో సంస్థలో ప్రొసెసింగ్ చేసుకునేందుకు ఒప్పందం చేసుకుంది. తర్వాత స్టార్ అగ్రో, ప్రసాద్ జంపెక్స్ మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తాయ్. స్టార్ అగ్రో 40 కోట్లు బకాయి పడిందని తమ మెటీరియల్ను విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఇవ్వకుండా ఎగనామం పెట్టిందని జంపెక్స్ ఆరోపిస్తోంది. స్టార్ అగ్రో ఆర్థిక లావాదేవీలు, ఎగుమతులు, దిగుమతుల చిట్టాను సేకరించారు. తర్వాత ఏ యే బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను మద్రాస్ హైకోర్టుతో పాటు ఫెరా లాంటి అంతర్జాతీయ సంస్థల దృష్టికి తీసుకెళ్లింది.
స్టార్ అగ్రో సంస్థ 2014-15లో 172 కోట్లు, 2013-15 ఆర్థిక సంవత్సరంలో ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 58 కోట్లు రుణం తీసుకుంది. ఈ అప్పు కాస్తా 2015-17 నాటికి 270 కోట్లకు చేరింది. స్టార్ అగ్రో సంస్థ తీసుకున్న రుణాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్పీఎ కింది చూపించింది. ఈ బకాయిలను రాబట్టుకునేందుకు బ్యాంక్ అధికారులు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. బకాయిలు రాకపోయినా బ్యాంకు అధికారులు రుణాలు ఎలా ఇచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్.