వివాహేతర సంబంధానికి అడ్డు వచ్చాడనే...చపాతీ కూరలో 30 నిద్రమాత్రలు.. ఆపై ఉరి
ఈ సృష్టిలో తల్లి ప్రేమకంటే గొప్పది మరొకటి లేదు. బిడ్డకు చిన్న కష్టం వచ్చినా తల్లిడిల్లుతుంది మాతృమూర్తి. చిన్న దెబ్బ తగిలినా.. తనకే తగిలినంతగా బాధపడుతుంది. కాని ఓ మహిళ మాత్రం తల్లి అనే పదానికి మాయని మచ్చ తెచ్చింది. ప్రియుడి మోజులో పడి కన్న కొడుకునే దారుణంగా చంపేసింది. ఆత్మహత్య చేసుకున్నాడంటూ డ్రామాలాడింది. చేసిన పాపం ఎక్కడికిపోతుంది.. చివరికి పోలీసుల దగ్గర అడ్డంగా బుక్కయ్యింది. విజయనగరంలో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
గాయత్రీనగర్లో నివాసముంటున్న వెంకట పద్మావతికి 2000లో కొండబాబుతో వివాహం జరిగింది. వారికి హరిభగవాన్ (17)తో పాటు ఓ కుమార్తె కూడా ఉంది. కొండబాబు డ్రైవింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. అయితే సంపాదన విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో 2012లో కొండబాబు నుంచి పద్మావతి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి గాయత్రీనగర్లోని తన సొంతిం టిలో పిన్ని సీతాలక్ష్మి, పిల్లలతో నివాసముంటోంది. వెంకటపద్మావతి కొన్ని ప్రైవేట్ సంస్థలకు ఏజెంట్గా పనిచేస్తోంది. ఈ నేపథ్యలో గోవింద్ అనే రియల్టర్తో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. తన తల్లి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి సహించని కుమారుడు హరిభగవాన్ తల్లిని పలుమార్లు హెచ్చరించాడు.
వెంకటపద్మావతి, గోవింద్ల కార్యకలాపాలకు అడ్డుగా ఉన్న హరి భగవాన్ను తప్పించాలనే ఉద్దేశంతో గోవింద్ ఇచ్చిన పథకాన్ని అమలుచేయడానికి పద్మావతి పలుమార్లు ప్రయత్నం చేసి విఫలమైంది. చివరకు నిద్రమాత్రలు ఇచ్చి హరి భగవాన్ను అడ్డు తొలగించుకోవాలని ఇరువురూ నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 21వ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో పద్మావతి పిన్ని సీతాలక్ష్మి తన సోదరుడు విశ్వనాథరాజుకు ఆరోగ్యం బాగోలేనందున బాబామెట్టకు వెళ్లింది. హరిని చంపాలంటే ఇదే సమయమని గోవింద్ తన ప్రియురాలు పద్మావతికి చెప్పాడు. పైగా గోవింద్ తన ఇంటి నుంచి ఎప్పటికప్పుడు ఫోన్లో హత్య ఎలా చేయాలో వివరించడం విశేషం.
ప్రియుడు గోవింద్తో ఫోన్లో మాట్లాడుతూ.. అతను చెప్పిన విధంగానే చపాతి కూరలో 30 నిద్ర మాత్రలు కలిపి కొడుకు గాఢంగా నిద్రలోకి జారుకోగానే, కొడుకు హరి భగవాన్ వీపు మీద కూర్చొని మెడకు చీర బింగించి రెండు చేతులుతో గట్టిగా లాగి ఊపిరి ఆడకుండా చంపింది. ఆ తరవాత గోవింద్తో ఫోన్లో మాట్లాడుతూ ఉరి వేసుకున్నట్టు ఫ్యాన్ కి చీర బిగించి నాటకానికి తెర లేపింది. అయితే పోలీసులు అనుమానం వచ్చి గట్టిగా అడగడంతో తానే చంపినట్టు మొదట ఒప్పుకున్న వెంకట పద్మావతి అదుపులోకి తీసుకొని మరింత లోతుగా విచారించగా ప్రియుడు పథకం పన్ని తనకి ఫోన్ లో చెప్పిన విధంగా చేశాను అని చెప్పడంతో శుక్రవారం రైల్వే స్టేషన్ సమీపంలో ప్రియుడు బి.గోవింద్ రావు, అలియాస్ శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని ఇద్దరని సబ్ జైల్ కి రిమెండ్ కి తరలించినట్టు రూరల్ సీఐ రమేష్ తెలిపారు.