విషాదం...ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Update: 2018-06-01 07:05 GMT

గుంటూరు జిల్లాలోని పొన్నూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. అర్బన్‌ సీఐ నాగేశ్వరరావు కథనం ప్రకారం పొన్నూరు మండలం జూపూడి గ్రామానికి చెందిన బొనిగెల శారద(34) తన ఇద్దరు పిల్లలతో కలిసి కొంతకాలంగా పొన్నూరులోని 31వ వార్డులో నివాసం ఉంటోంది. గురువారం అర్థరాత్రి తనతో పాటు తన పిల్లలపై వంటనూనె, డీజిల్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో శారదతో పాటు ఆమె పిల్లలు శ్రేష్ట(11), ప్రకాశ్‌వర్మ(7)లు అక్కడికక్కడే మంటలకు ఆహుతయ్యారు. శారద భర్త ఏడేళ్ల కిందట మృతి చెందాడు. రెండు రోజుల క్రితం మరో వ్యక్తిని ఈమె వివాహం చేసుకున్నట్లు బంధువులు చెప్పారు. రెండో భర్తతో విభేదాల వల్లే శారద ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. మృతదేహాలను నిడుప్రోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాపట్ల డీఎస్పీ గంగాధరం, సీఐ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Similar News