తెలంగాణ ఆర్టీసీ బస్సు స్టీరింగ్.. ఇప్పుడు సీఎం కేసీఆర్ చేతిలో ఉంది. దానిని సమ్మె వైపు తిప్పుతారా.. లేక.. కార్మికసంఘాల డిమాండ్ల వైపు తిప్పుతారా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఆర్టీసీ యూనియన్ల ప్రతిపాదనలను మంత్రుల కమిటీ సీఎం దృష్టికి తీసుకెళ్లింది. తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి కేసీఆరే తీసుకోనున్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి.. సీఎం కేసీఆర్తో మంత్రుల కమిటీ చర్చించింది. కార్మిక సంఘాల ప్రతిపాదనలను, డిమాండ్లను.. మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు, తుమ్మల, కేటీఆర్, జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డితో కూడిన కమిటీ ముఖ్యమంత్రి ముందు ఉంచింది. సోమవారం నుంచి కార్మికులు సమ్మెకు వెళ్తే.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్న దానిపై చర్చించారు. ఐతే.. ఫైనల్ డెసిషన్ మాత్రం.. సీఎం కేసీఆరే తీసుకోనున్నారు.
సీఎంతో భేటీకీ ముందు.. మంత్రుల కమిటీ ఆర్టీసీ కార్మికసంఘాల నేతలతో సమావేశమైంది. ఇప్పటికిప్పుడు ఫిట్మెంట్ అంటే.. ప్రభుత్వంపై భారం పడుతుంది.. పైగా ఆర్టీసీ కూడా నష్టాల్లో ఉందని.. మంత్రులు బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఫిట్మెంట్కు బదులుగా.. మధ్యంతర భృతి ఇస్తాం.. సమ్మెపై పునరాలోచించుకోవాలని చెప్పారు. దీనికి.. ఆర్టీసీ యూనియన్ల నాయకులు అస్సలు ఒప్పుకోలేదు. తమకు మధ్యంతర భృతి వద్దని.. ఫిట్మెంటే ఎంత ఇస్తారో చెప్పాలని.. కార్మికసంఘాల నేతలు తేల్చి చెప్పారు.
ఫిట్మెంట్తో పాటు.. యూనియన్ నాయకులు మరికొన్ని ప్రతిపాదనలు మంత్రుల కమిటీ ముందుంచారు. ఆర్టీసీ అప్పులను ప్రభుత్వం సింగిల్ సెటిల్మెంట్లో మాఫీ చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని.. ప్రతి నెలా చెల్లించాలని కోరారు. మోటార్ వెహికిల్ ట్యాక్స్ను ప్రభుత్వం ఎత్తేయాలని.. ఆర్టీసీ వాడుతున్న డీజిల్ ఫీ ట్యాక్స్లు రద్దు చేయాలని మంత్రుల కమిటీని కోరారు.
కార్మికసంఘాల నేతల ప్రతిపాదనలు, డిమాండ్లను విన్న మంత్రుల కమిటీ.. వాటిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లింది. వాటిపై.. సీఎం.. అధికారులతో చర్చిస్తున్నారు. కార్మికుల డిమాండ్లకు సంబంధించి.. కీలక నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. కార్మికుల డిమాండ్లకు.. తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్తుందా.. లేక ఆర్టీసీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందా అన్నదే ఇప్పుడు ఇంట్రస్టింగ్గా మారింది.