ఈడీ కేసులో జగన్ రాసిన బహిరంగ లేఖపై మంత్రి యనమల రామకృష్ణుడు కౌంటర్ ఇచ్చారు. జగన్ వాదన విచిత్రంగా ఉందంటూ యనమల కౌంటర్ ఇచ్చారు. ఈడీ కేసులో జగన్ కుటుంబం ప్రమేయం ఉందో? లేదో? ఆయన స్పష్టం చేయాలని కోరారు. అవినీతి చేయలేదని జగన్ ఎక్కడా చెప్పలేదన్నారు. అయితే జగన్ రాసిన లేఖలో ఆయన కుటుంబ ప్రమేయం స్పష్టంగా అర్థమైందన్నారు. ఈడీ ఛార్జిషీట్తో తెలుగుదేశం పార్టీకి ఎలా సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. కేసు ద్వారా సానుభూతి పొందేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించిన యనమల... జగన్ వైఖరితోనే కుటుంబ సభ్యులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తోందన్నారు. జగన్ ఎక్కడా కేసులో పేరు ఉండడాన్ని ఖండించలేదని వ్యాఖ్యానించిన ఆయన... లేనిది ఉన్నట్లు రాస్తే తప్పు పట్టాలని... కేసులో పేరు ఉందని జగన్ న్యాయవాదులే చెబుతున్నారన్నారు.