Adulterated Milk: రాజమండ్రిలో ఆగని కల్తీ పాల మరణాలు.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య..
Adulterated Milk: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిని వణికిస్తున్న కల్తీ పాల ఘటనలో మరణాల పరంపర కొనసాగుతోంది.
Adulterated Milk: రాజమండ్రిలో ఆగని కల్తీ పాల మరణాలు.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య..
Adulterated Milk: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిని వణికిస్తున్న కల్తీ పాల ఘటనలో మరణాల పరంపర కొనసాగుతోంది. ఈ విషాదంలో తాజాగా మరొకరు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు (7) చేరింది. గత వారం రోజులుగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న సూర్యారావు అనే వ్యక్తి మంగళవారం చికిత్స పొందుతూ కన్నుమూశారు.
చౌడేశ్వరి నగర్కు చెందిన సూర్యారావు కల్తీ పాలు సేవించి అస్వస్థతకు గురయ్యారు. గత వారం నుంచి ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే, వరుసగా రెండు రోజుల్లో ఇద్దరు మరణించడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అధికారుల చర్యలు చేపట్టినప్పటికీ మరణాలు సంభవించడంపై బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ పాల మూలాలను వెతికి తీయడంలో యంత్రాంగం వైఫల్యం చెందిందని స్థానికులు మండిపడుతున్నారు.
ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. బాధితులు నివసించే ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ, మరణాల సంఖ్య పెరుగుతుండటం అధికారులకు సవాల్గా మారింది. కల్తీ పాలు సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని రాజమండ్రి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.