Tirumala : తిరుమల భక్తులకు అలెర్ట్..నేడు 10 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల భక్తులకు అలెర్ట్..నేడు 10 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత
Tirumala : తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. నేడు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు సుమారు పదిన్నర గంటల పాటు మూతపడనున్నాయి. ఆకాశంలో ఏర్పడనున్న చంద్రగ్రహణం కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. గ్రహణ సమయంలో ఆలయ నియమాల ప్రకారం పూజా కార్యక్రమాలు నిలిపివేసి, తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. నేడు ఉదయం 9:00 గంటల నుంచే ఆలయ ద్వారాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఖగోళ శాస్త్రం ప్రకారం.. నేడు మధ్యాహ్నం 3:20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై, సాయంత్రం 6:47 గంటలకు ముగుస్తుంది. అయితే, ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం గ్రహణం ప్రారంభానికి సుమారు 6 గంటల ముందే ఆలయాన్ని మూసివేస్తారు. అందుకే ఉదయం 9 గంటలకే శ్రీవారి దర్శనాలను నిలిపివేసి, గర్భాలయ ద్వారాలను మూసివేస్తారు. ఈ సమయంలో స్వామివారికి ఎలాంటి కైంకర్యాలు జరగవు. మళ్లీ రాత్రి 7:30 గంటలకు గ్రహణం విడిచిన తర్వాతే ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి.
గ్రహణం ముగిసిన వెంటనే ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేపడతారు. రాత్రి 7:30 గంటలకు తలుపులు తీసిన తర్వాత, అర్చకులు ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ శుద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి కావడానికి సుమారు గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
సాధారణ భక్తులకు రాత్రి 8:30 గంటల నుంచి శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభమవుతుంది. ఆలయ మూసివేత కారణంగా నేడు జరగాల్సిన పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. గ్రహణం కారణంగా వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలో అల్పాహారం, పాలు, తాగునీరు అందుబాటులో ఉంచారు. తిరుమలకు వచ్చే భక్తులు ఈ సమయాలను గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.