భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పినపాక మండలం భూపతిరావుపేట సుందరయ్యనగర్లో మెరుపు దాడిచేసి బీభత్సం సృష్టించారు. ఇన్ఫార్మర్ల నెపంతో ఒకరిని నరికిచంపిన మావోయిస్టులు.... మరొకరిపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత భూపతిరావుపేటలోని గిరిజన సొసైటీ ఇసుక ర్యాంపుపై మెరుపు దాడి చేశారు. నాలుగు లారీలు, మూడు జేసీబీలు, ఒక డోజర్, ఒక ట్రాక్టర్ను తగలబెట్టారు. మొత్తం మూడు బృందాలుగా దాడిచేసి విధ్వంసం సృష్టించారు.
భూపతిరావుపేట ఇసుక ర్యాంపుపై మావోయిస్టులు మెరుపు దాడి చేయడంతో నిర్వాహకులు తలో దిక్కు పారిపోయారు. సుమారు 45మంది సాయుధులైన మావోయిస్టులు ఒక్కసారిగా విధ్వంసం సృష్టించడంతో భయంతో వణికిపోయారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారంటూ ఓ లేఖ వదిలిపెట్టిన మావోలు ఇద్దరు కూలీలను వెంట తీసుకెళ్లారు అయితే వాళ్లిద్దరినీ కొద్దిదూరంలోనే వదిలి వెళ్లిపోయారు.
ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు మాజీ మావోయిస్టులపై అటాక్ చేశారు. భూపతిరావుపేట ఉమేష్చంద్రనగర్లో మాజీ మావోయిస్ట్ జోగయ్యను నరికిచంపారు. ఆ తర్వాత సుందరయ్యనగర్లో మరో మావోయిస్ట్ రమేష్పై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. వీళ్లిద్దరూ పోలీసులకు సహకరిస్తూ సమాచారమిస్తున్నారనే అనుమానంతో దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే మావోయిస్టుల కాల్పుల నుంచి రమేష్ తప్పించుకున్నాడు. కేవలం చేతికి గాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
మావోయిస్టుల మెరుపు దాడి పోలీసులు అలర్ట్ అయ్యారు. పినపాక మండలం హైఅలర్ట్ ప్రకటించారు. మావోయిస్టులు విధ్వంసం సృష్టించిన భూపతిరావుపేటను జల్లెడపట్టిన స్పెషల్ పార్టీ పోలీసులు పినపాక మండలం పరిధిలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇక మణుగూరు ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టులు వదిలివెళ్లిన లేఖను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుమారు పదేళ్ల తర్వాత పినపాక మండలంలో మావోయిస్టులు మెరుపు దాడి చేయడంతో ముఖ్య నేతలను అలర్ట్ చేశారు. మావోయిస్టుల హిట్ లిస్ట్లో ఉన్న లీడర్లను సురక్షిత ప్రాంతాలను వెళ్లాలని సూచిస్తున్నారు.