ఓ స్కూల్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడేందుకు వచ్చిన ఓ యువకుడి కన్ను, పక్కనే ఉన్న ఇంట్లోని యువతిపై పడింది. ఆట మధ్యలో మంచినీళ్లు కావాలంటూ ఇంటికి వెళుతూ మాటలు కలిపి, పరిచయం పెంచుకుని, నమ్మించి తీసుకెళ్లి, ఆపై మత్తుమందిచ్చి అత్యాచారం చేయడంతో పాటు వీడియో తీసి వేధించాడు. విజయవాడ పరిధిలోని చిట్టినగర్ లో జరిగింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు పొట్నూరి లక్ష్మణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్థానికంగా ఓ స్కూల్లో పనిచేస్తున్న యువతి (20) తన అన్నయ్యతో కలిసి ఉంటోంది. యువతి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు. అన్నయ్య మానసిక పరిస్థితి సరిగా ఉండదు.
చిట్టినగర్ దుర్గాసి రాములు వీధికి చెందిన పొట్నూరి లక్ష్మణ్ స్నేహితులతో కలిసి స్కూల్ గ్రౌండ్కి క్రికెట్ ఆడేందుకు వచ్చేవాడు. క్రికెట్ ఆడే సమయంలో లక్ష్మణ్ స్కూల్ ఆవరణలో ఉండే యువతిని గమనించాడు. ఆమెతో మాటలు కలిపేందుకు పదే పదే మంచినీళ్లు కావాలని అడిగే వాడు. చివరకు యువతి ఫోన్ నెంబర్ సంపాదించి ఫోన్ చేయడం, మెస్సేజ్లు పెట్టడం ప్రారంభించాడు. నమ్మకంగా ఉండటంతో లక్ష్మణ్తో యువతి మాట్లాడేది... ఒక రోజు ఆమెను తన ఇంటికి రావాలని, తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని చెప్పి నమ్మించాడు. బైక్పై ఇంటికి తీసుకు వెళ్లగా... ఇంట్లో అందరూ బయటకు వెళ్లారని చెప్పి మత్తు మందు కలిపిన కూల్డ్రింక్ తాగించాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడమే కాకుండా సెల్ఫోన్తో వీడియో తీశాడు. బయటకు చెబితే, వీడియోలు బయట పెడతానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆపై పలుమార్లు సినిమాలకు, షికార్లకూ తిప్పి ఆమెను అనుభవించాడు. యువతి పెళ్లి ప్రస్తావన తేగానే తప్పించుకోవడం మొదలు పెట్టాడు. కనిపించకుండా పోయి, ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో ఆమె కొత్తపేట పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదైంది.