బాలికను లోబరుచుకోవడమే కాకుండా ఆమెను గర్భవతిని చేసాడో యజమాని. న్యాయం చేసే గ్రామా పెద్దలు మాత్రం శీలానికి వెల కట్టారు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట గ్రామంలో నివాసముంటోంది బాధిత బాలిక(16) కుటుంభం.తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ఆ బాలిక వ్యవసాయ పనులకు వెళుతోంది. కొన్ని నెలలుగా పత్తి పొలంలో కూలీకి వెళ్తోంది. ఈ క్రమంలో ఆ పొలం యజమాని, మల్దకల్ వెంకటయ్య బాలికను లోబర్చుకున్నాడు. దీంతో ఆమె గర్భందాల్చింది. కుమార్తెలో శారీరక మార్పులను గమనించిన తల్లి వైద్య పరీక్షలు చేయించడంతో గర్భిణి అని తేలింది. దీనికి కారకుడు యజమాని వెంకటయ్య అని తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు మంగళవారం రాత్రి వెంకటయ్యను ఇంటికి పిలిపించి బంధించారు. దీంతో గ్రామానికి చెందిన పెద్దలు వారితో చర్చలు జరిపి పరిహారంగా రూ.2.10 లక్షలు బాలికకు చెల్లించేలా బాలిక కుటుంబాన్ని ఒప్పించారు. ఈ మేరకు ఇరు కుటుంబాల సమక్షంలో ఒప్పంద పత్రాన్ని కూడా రాయించారు. తప్పు చేసిన వెంకటయ్యను డబ్బు హామీతో వదిలేశారు.