ఐదు రోజుల్లో పెళ్లి.. కానీ అంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం నగరంలోని 15వ డివిజన్ పార్శీ బంధం ప్రాంతానికి చెందిన సిరిగిరి మోగలాల్, గురువమ్మ దంపతుల మూడవ కుమారుడు బాజి అలియాస్ బాలాజీ(23) చదువు పూర్తి చేసి జాతకాలు చెబుతుండేవాడు. అయితే కొంతకాలంగా అతను కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. మందులు వాడుతున్నాడు. ఇటీవల కడుపు నొప్పి తగ్గటంతో తల్లిదండ్రులు పెళ్లి కుదర్చారు. ఈ నెల 31న అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం జరగాల్సి ఉంది. అందరూ పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారు. కానీ అనూహ్యంగా ఆదివారం ఉదయం అతని కుటుంబీ కులు లేచేసరికి, ఇంట్లోని దూలానికి ఉరికి వేలాడుతూ బాలాజీ కనిపించాడు. దీంతో కుటుంబీకులు ఒక్కసారిగా గుండెలవిసేలా రోధించారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన తమ కొడుకు మృతిచెందాడన్న వార్తను తల్లిదండ్రులు జీర్ణించుకోలేకున్నారు. బాలాజీ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.