బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత జరుగుతున్న తెలుగుదేశం మహానాడు అందర్లోనూ ఆసక్తి రేపుతోంది. ఎన్నికలకు ఇంకా ఏడాదే ఉండటం...తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మహానాడు వేదికగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడం..ఆంధ్ర ప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ తీర్మానాలకు ప్రధాన్యత ఏర్పడింది. మహానాడులో మొత్తం 36 తీర్మానాలు ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఏపీకి సంబంధించి 24, తెలంగాణాకు సంబందించి 8, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 4 తీర్మానాలు ఉంటాయి. కీలకమైన రాజకీయ తీర్మానం కోసం కసరత్తు పూర్తి చేశారు.
జాతీయ రాజకీయాల్లో టీడీపీ పాత్ర...ప్రత్యేక హోదా ఉద్యమాలు...ప్రత్యేక హోదాకు సంబంధించి టీడీపీ వైఖరి వంటి విషయాలపై మహానాడు వేదికగా చర్చిస్తారు. అలాగే వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర, వైసీపీ వ్యూహాలు, పవన్ కల్యాణ్ పర్యటనలు, టీడీపీకి బీజేపీకి సాగుతున్న మాటలయుద్ధం గురించి మహానాడులో చర్చ జరుగుతుంది. అలాగే వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడంతో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలంటే జాతీయ స్థాయిలో ఎవరితో పొత్తు ఉండాలనే విషయంపై దృష్టి పెడతారు. ఇక ఇటీవల బెంగళూరు పర్యటనలో చంద్రబాబు మమత, మాయావతి, కేజ్రీవాల్, వామపక్షాల నేతలతో భేటీ అయ్యి..ప్రాంతీయ పార్టీల వేదిక ఏర్పాటు చేసేందుకు జరిపిన చర్చలపైన మహానాడులో రాజకీయ తీర్మానం ఉంటుంది. 2019 ఎన్నికలపై టీడీపీ నేతలు పైకి ధీమాగానే ఉన్నా...లోలోన ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆందోళనలో ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికలకు దిశా నిర్దేశం చేసేలా మహానాడు సాగనుంది.