Nellore: ఎండలు ముదురుతున్నాయి.. సిద్ధంగా ఉండండి
Nellore: నెల్లూరు జిల్లాలో వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు కలెక్టర్ హిమాన్షు శుక్లా సమ్మర్ యాక్షన్ ప్లాన్.
Nellore: ఎండలు ముదురుతున్నాయి.. సిద్ధంగా ఉండండి
Nellore: రానున్న మూడు నెలల్లో వేసవి తీవ్రత దృష్ట్యా జిల్లాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికాబద్ధంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
రానున్న మే జూన్ జూలై నెలల్లో వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులను ఆదేశించారు. మెట్ట ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. గ్రామాల్లో చేతి పంపులన్నీ సక్రమంగా పనిచేసేలా, ఓవర్ హెడ్ ట్యాంకులు, తాగునీటి పథకాలన్నీ సమర్థవంతంగా పనిచేసేలా పర్యవేక్షించాలన్నారు.
పశువులకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పనులు పూర్తయిన యానిమల్ హాస్టల్స్ ను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సోమశిల, కండలేరు జలాశయాల నుంచి సాగునీటి కాలువలకు ఎంత మేర రైతులకు అవసరమో అంతమేర మాత్రమే విడుదల చేయాలన్నారు. సమగ్ర సాగునీటి యాజమాన్య పద్ధతులను పాటించి నీరు వృధా కాకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు.
వేసవిలో ప్రజలు వడదెబ్బ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా బస్స్టేషన్లు, జనసంచారం ఉన్న కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో చిన్నారులకు ఇబ్బందులు లేకుండా ఎక్కువ నీరు తాగేలా చూడాలన్నారు.
మున్సిపాలిటీ కేంద్రాల్లో స్వచ్ఛంద సేవాసంస్థల సహకారంతో చలివేంద్రాలు, మజ్జిగ, షర్బత్, నిమ్మకాయ సోడా, చల్లని పానీయాలు ప్రజలకు అందించేందుకు ప్రముఖ వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. వేసవిలో ప్రజల దాహార్తి తీర్చడంలో విశేషంగా కృషి చేసిన ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు 50,000 నగదు బహుమతిని అందజేస్తామని కలెక్టర్ ప్రకటించారు. ఈ వేసవిలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయ్ కుమార్, జడ్పీ సీఈవో శ్రీధర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వసుమతి, డ్వామా పిడి గంగాభవాని, వ్యవసాయాధికారి సత్యవాణి, సోమశిల ఎస్ఈ వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.