నెలరోజుల క్రితమే ప్రేమవివాహం చేసుకున్న మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా స్వామిమలై సమీపం అన్నానగర్ లో జరిగింది. అన్నానగర్ కు చెందిన నీలమేఘం కుమార్తె అనసూయ (24) బీటెక్ చదివి ఇంటివద్దే ఉంటోంది. వీరి ఎదురింటికి చెందిన సెల్వరాజ్ కుమారుడు పుగళేంది కేబుల్ టీవీలో పని చేస్తున్నాడు. పుగళేంది, అనసూయ మధ్య ప్రేమ చిగురించింది. ఈ క్రమంలో పుగళేంది, అనసూయ లు నెలక్రితమే రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఇటీవల వీరి వివాహం గురించి ఇరువురి ఇళ్లలో తెలిసింది. దీంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. పంచాయితీ పెద్దలు కూడా వీరి వివాహం సరైనదేనని తీర్పు చెప్పారు. అయితే ఈ పెళ్లి అనసూయ తండ్రి నీలమేఘంకు నచ్చలేదు. దీంతో కుమర్తెను కాపురానికి పంపించలేదు. పైగా పుగళేంది కుటుంబసభ్యులు కూడా ఈ విషయంపై పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన అనసూయ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె మరణంతో ఆవేశానికి లోనైన నీలమేఘం బంధువులు.. పుగళేంది, సహోదరులు సుమతి, గోమతి ల ఇంటికి నిప్పు పెట్టారు. ఇందులో మూడు ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.