తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై టీడీపీకి గుడ్బై చెప్పిన తాడిపత్రి నేతలు జగ్గీ బ్రదర్స్(బొమ్మిరెడ్డి జగదీశ్వర్రెడ్డి, జయచంద్రారెడ్డిలు) తీవ్ర ఆరోపణలు చేశారు. జెసి బ్రదర్స్ నుంచి తమకు ప్రాణహాని ఉందని జగదీశ్వర్ రెడ్డి, జయచంద్రా రెడ్డి అన్నారు. ‘తాడిపత్రిలో అరాచకం రాజ్యమేలుతోంది. జేసీ బ్రదర్స్ రూ. 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. నిరూపించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. దౌర్జన్యాలు, అక్రమాలకు తెగబడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. వాళ్ల నుంచి మాకు ప్రాణహాని ఉంది. జేసీ ఫ్యామిలీ నుంచి మా ఇద్దరికీ రక్షణ కల్పించాలంటూ చంద్రబాబు గతంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్కు లేఖ కూడా రాశారు. మాకు ఏ హాని జరిగినా జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, వారి కొడుకులే కారణం. ఇకపై జేసీ బ్రదర్స్ ఓటమే లక్ష్యంగా కృషిచేస్తాం’ అని జగ్గీ బ్రదర్స్ పేర్కొన్నారు.