వరుస హత్యాకాండలతో రాజధాని నగరం ఎరుపెక్కింది. వేర్వేరు ఘటనల్లో మంగళవారం ఒక్కరోజే ఇద్దరు యువతుల హత్యోదంతాలు వెలుగులోకి వచ్చాయి. కోండాపూర్ బొటానిక్ గార్డెన్ సమీపంలోని శ్రీరాంసాగర్ కాలనీలో గోనె సంచిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటపడింది. దీన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ కార్మికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ముక్కలు ముక్కలుగా నరికి సంచిలో పెట్టిన దుండగులు పడిసి వెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు.
హయత్నగర్లో దేవరకొండకు చెందిన అనూష దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు బండరాళ్లలో అతికిరాతంగా కొట్టి హతమార్చారు. మృతురాలు ఇటీవలే బీటెక్ పూర్తికావడంతో... పోలీస్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది. హయత్ నగర్లో ఒంటరిగా ఉంటున్న అనూష హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపుతోంది. మోహన్ అనే యువకుడితో కొన్ని రోజుల కిందటే నిశ్చితార్థమైందని, హత్యలో అతని ప్రమేయం కూడా ఉండొచ్చని మృతురాలి కుటుంబీకులు అనుమానిస్తున్నారు. నిశ్చితార్థం తర్వాత నుంచి మోహన్ వేధిస్తున్నాడని, ఘటన జరిగిన రోజు నుంచి అతని మొబైల్ స్విచాఫ్ చేసి ఉందని అనూష సోదరులు మీడియాతో అన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.