హైదరాబాద్‌లో బ్లూవేల్‌ కలకలం

Update: 2017-12-31 11:55 GMT

అదో హిప్నాటిక్ గేమ్. సరదాగా ఆట మొదలవుతుంది..చిన్న చిన్న సవాళ్లను విసురుతుంది.. ఆటను వ్యసనంగా మారుస్తుంది.. ఇక ఫైనల్ టాస్క్ మాత్రం ప్రాణాలకు ముగింపు పలుకుతుంది.. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న బ్లూవేల్ భూతం హైదరాబాద్‌కు పాకింది. ఓ నిండు జీవితాన్ని బలితీసుకుంది. రాజేంద్ర నగర్‌ సన్‌సిటీలోని మిఫుల్‌ టౌన్‌ విల్లాకు చెందిన వరుణ్ బ్లూవేల్‌ బారిన పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్‌ బిట్స్‌పిలానీలో రెండో సంవత్సరం చదువుతున్న వరుణ్‌ సెలవుల కారణంగా వారం రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. గత మూడు రోజుల నుంచి తన రూమ్‌ నుంచి బయటకు రాకుండా బ్లూవేల్‌ గేమ్‌ ఆడుతున్నాడు. కుమారుడి ప్రవర్తను గమనించిన తల్లి పరిస్థితిని గురించి వరుణ్‌ తండ్రికి వివరించింది. విషయం తెలుసుకున్న వరుణ్‌ తండ్రి ఇంట్లో ఇంటర్నెట్‌ను తీసేయించాడు. దీంతో మనస్థాపానికి గురైన వరుణ్‌ తలకు ప్లాస్టిక్‌ కవర్‌, ఊపరి ఆడకుండా కొంతకు తాడుతో గట్టిగా  బిగించుకుని గతరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రోజు మొత్తం వరుణ్‌ బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు వరుణ్‌ గదిని తనిఖీ చేయగా విగతజీవుడిగా పడిఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వరుణ్‌ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బ్లూవేల్‌ గేమ్ కారణంగానే వరుణ్‌ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. గదిలో వరుణ్‌ గేమ్స్‌ ఆడిన లాప్‌టాప్‌, మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉస్మానియా హాస్పిటల్‌లో పోస్టుమార్టం అనంతరం వరుణ్‌ మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.
 

Similar News