ఏపీలో విస్తారంగా వర్షాలు

Update: 2018-08-21 13:23 GMT

నాలుగు రోజులనుంచి కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. కొన్నిచోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టినా.. వరద ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గోదావరి ఉగ్రరూపానికి లోతట్టు ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కోనసీమలో 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే భారీ వర్షాలతో రాజమండ్రిలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆలమూరు మండలం బడుగువాని లంక, తోక లంక, కేదార లంకలు వరద నీటిలోనే నానుతున్నాయి. ముమ్మిడి వరం మండలంలోని పది గ్రామాల ప్రజలు వరదనీటిలోనే ఇబ్బందులు పడుతున్నారు. గౌతమి, వృద్ధగౌతమి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరివాహక గ్రామాలు నీట మునిగాయి. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విజయవాడ జలమయం అయింది. ఆటో నగర్‌, రోటరీ నగర్‌ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అమరావతి సైతం నీటిలో నానుతోంది. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలు వరద తాకిడికి గురయ్యాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం ఏర‍్పడిక అల్పపీడనం సోమవారం మరింత బలపడింది. దీంతో కోస్తాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తీరం అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది. 

Similar News