వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. ఈసంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నారాయణపురం గ్రామ శివారు కొత్తతండాలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కురవి ఎస్సై నాగభూషణం తెలిపిన ప్రకారం... కొత్తతండాకు చెందిన బానోత్ భద్రు, మాలోతు లింగన్న(24) మామ అల్లుళ్లు. భద్రు కు పదేళ్లక్రితం ఖమ్మం జిల్లాకు చెందిన నాగమణితో వివాహమైంది. వీరికి కుమారుడు ఉన్నా డు. భద్రు మేనల్లుడు మాలోత్ లింగన్న నాగమణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఈ విషయం భర్త భద్రుకు తెలియడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా లింగన్నకు జరిమానా విధించి భద్రు దంపతులను కలిపారు. కొద్దిరోజుల తర్వాత భార్య పుట్టింటికి పోయి సంవత్సరం గడిచినా రాకపోవడంతో భద్రు లింగన్నపై కక్ష పెంచుకున్నాడు.
దీంతో లింగన్నను హత్య చేయాలని భద్రు నిర్ణయించుకున్నాడు. ఆదివారం రాత్రి తండాలోని గణేష్ విగ్రహాన్ని యువకులు డీజే సౌండ్కు నృత్యాలు చేస్తూ నిమజ్జనానికి ఊరేగింపుగా తరలిస్తున్నారు. వారిలో మేనల్లుడు లింగన్న కూడా ఉండటాన్ని భద్రు చూశాడు. వెనుక నుంచి వచ్చి గొడ్డలితో అతడి తలపై నరికాడు. దీంతో లింగన్న తల పగిలి కింద పడ్డాడు. వెంటనే భద్రు అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న లింగన్న తలకు ఓ వ్యక్తి తన షర్ట్ గట్టిగా కట్టి మరో వ్యక్తి సాయంతో బైక్పై కూర్చోబెట్టుకుని మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించాడు. అక్కడ స్టెచర్పై పడుకోబెడుతుండగా లింగన్న మృతిచెందాడు. భద్రు గొడ్డలతో సహా కురవి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.