కర్నూలు జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. భూమి చీలి పోయి పొరల్లో నుంచి పెద్ద ఎత్తున మంటలు వెలువడుతున్నాయి. ఆశ్చర్యం కలిగించే ఈ వింతను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. మంటల ధాటికి ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ స్తంభం కూలిపోయింది. దీంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.
ఎలాంటి నిప్పులు లేకుండా ఎవరు వెలిగించకుండా భూమి పోరల్లోంచి మంటలు చేలరేగిన ఘటన ఆవుకు మండలం మరికుంట తండా, లక్ష్మీపల్లె పరిసర ప్రాంతాలలో చోటుచేసుకుంది. భూమిలోపలి నుంచి మంటలు రావడంతో కలవరపడ్డ గ్రామస్తులు వాటిని ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. అయినా మంటలు ఆరకపోవడంతో భయపడ్డ గ్రామస్తులు తహశీల్ధార్ దృష్టికి తీసుకెళ్లారు. ఘటన స్ధలానికి చేరుకున్న ఆయన పరిస్థితిని సమీక్షించారు.
గాలిమరలకు చెందిన మిత్ర కంపెనీ, టెక్నికల్ సిబ్బందితో పాటు జియాలజిస్ట్లు మంటలు ఎగసిపడుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. మీథేన్ వాయువు అధికంగా వెలువడుతోందని భావిస్తున్నారు. ఈ గ్యాస్ కారణంగానే మంటలు రేగుతున్నాయని చెబుతున్నారు. మరోవైపు ఎడతెరపి లేకుండా భూమి నుంచి వేడి గాలులు, మంటలు రావడంతో స్ధానికులు భయాందోళన చెందుతున్నారు.