విజయవాడలో బాలిక అనుమానాస్పద మృతి మిస్టరీ వీడింది. పాయకాపురానికి చెందిన కృష్ణవేణి గత నెల31వ తేది మృతి చెందింది. అనారోగ్యంతో చనిపోయిందటూ బాలికకు అంత్యక్రియలు చేసేందుకు తరలించగా అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పాప డెడ్బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించారు. రిపోర్టులో చిన్నారిని గట్టిగా కొట్టడం వల్లే చనిపోయిందని తేలడంతో తండ్రిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదుచేసుకుని నిందితుడు రమణను అదుపులోకి తీసుకున్నారు.
స్థానిక ఉడా కాలనీలో ఉంటూ ఆటోడ్రైవర్గా పనిచేస్తోన్నాడు రమణ. అతనికి పదోతరగతి చదివే కూతురు(కృష్ణవేణి) ఉంది. ఇటీవలికాలంలో కృష్ణవేణి కోసమంటూ రమణ మొబైల్కి కాల్స్ ఎక్కువగా వచ్చాయి. ఇదే విషయమై నాలుగురోజుల కిందట ఇంట్లో గొడవజరిగింది. ఆ కాల్స్కు, తనకు ఎలాంటి సంబంధం లేదని కూతురు తెగేసి చెప్పింది. అయినాసరే వినిపించుకోకుండా ఉన్మాదిలా మారిన రమణ.. కూతురిని విచక్షణారహితంగా కొట్టాడు. కణత భాగంలో బలంగా దెబ్బతగలడంతో కృష్ణవేణి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.