ఫేస్బుక్లో పరిచయమైన యువతిని మాయమాటలతో నమ్మించి సినిమాకు తీసుకెళ్లి థియేటర్లోనే అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ యువకుడు. మార్కెట్ ఇన్స్పెక్టర్ మట్టయ్య కథనం ప్రకారం..జనగాం జిల్లా నెర్మెట్ట గ్రామానికి చెందిన భిక్షపతి(23) జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన యువతి(19) ఇంటర్ వరకు చదువుకుంది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. భిక్షపతికి రెండు నెలల క్రితం ఆ యువతితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఫోన్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భిక్షపతి జగద్గిరిగుట్టలో ఉండే చెల్లెలు ఇంటికి తరచుగా వస్తుండేవాడు. ఇలా రెండు మార్లు నగరానికి వచ్చిన సమయంలో ఇద్దరు కలుసుకున్నారు.
గత నెల 28వ తేదీన నగరానికి వచ్చిన భిక్షపతి ఆమెతో కలిసి పలు ప్రాంతాల్లో తిరిగారు. 29వ తేదీన మరోమారు ఇద్దరు కలిసి ఇందిరాపార్కుకు వెళ్లి, అక్కడ నుంచి మధ్యాహ్నం సికింద్రాబాద్ ప్రశాంత్ థియేటర్లో పద్మావతి సినిమా చూసేందుకు వెళ్లగా, కొద్దిమంది ప్రేక్షకులు మాత్రమే ఉన్నారు. ఇదే అదునుగా భావించిన నిందితుడు థియేటర్లోని బాల్కనీలో సినిమా నడుస్తున్న సమయంలోనే అత్యాచారం చేశాడు. యువతికి రక్తస్రావం కావడంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి, అదే రోజు మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం సాయంత్రం నిందితుడిని అదుపులోకి తీసుకుని గురువారం రిమాండుకు తరలించారు. థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.