చదువులు చంపేస్తున్నాయి. మార్కుల మహాయజ్ఞంలో విద్యార్థులు జీవితాలు సమిధలవుతున్నాయి. పుస్తకమే సమస్తమైతే నరకం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపిస్తున్నాయి నారాయణ, చైతన్య సహా ఇతర కార్పొరేట్ కళాశాలలు. బంగారు భవిత కోసం అహర్నిశలు కష్టపడుతున్న తల్లిదండ్రుల ఆశలను, విద్యార్థుల ఆశయాలను, వారి జీవితాలను నిర్దాక్షణ్యంగా కడతేరుస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఆన్లైన్ క్యాంపెయిన్ తెరలేచింది.
అప్పుడప్పుడే ఎదుగుతున్న మెదళ్లు పరీక్షా యంత్రాల మధ్య నలిగిపోతున్నాయి. ఇంటర్ అంటేనే ఉరకలెత్తే ఉత్సాహానికి ప్రతీకగా భావించే విద్యార్థులు కార్పొరేట్ కాలేజీలు చూపిస్తున్న నరకంలో చిక్కుకొని అల్లాడిపోతున్నారు. వారి మార్కుల వేటలో, ర్యాంకింగ్ ఆటలో కూరుకుపోయి చతికిలబడుతున్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన సరస్వతీ నిలయాలను శవాగారాలుగా మారుస్తున్నాయి.
ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏడాదిలో 47 మంది విద్యార్థులు బలన్మరణాలను పాల్పడటమే విషాదం. ఇదిగో తాము అనుభవించిన నరకమంటూ లెటర్లు రాసి లెక్కుల చెబుతూ కన్నుమూస్తున్నారు భావి భారత పౌరులు. ఒత్తిడి చదువులు భరించలేక తనువు చాలిస్తున్నామంటూ ఆత్మహత్యలకు పాల్పడుతూ కన్నవారికి కడుపుకోత మిగిలుస్తున్నారు.
ఈ చావులన్నీ కార్పొరేట్ కాలేజీల్లో అందులోనూ కేవలం శ్రీచైతన్య నారాయణ కాలేజీల్లోనే జరుగుతున్నాయి. ర్యాంకులు సాధిస్తే, ఒకటి రెండు, మూడు మూడు అంటూ రంకెలు వేసే ఈ కళాశాలల్లోని హాస్టల్స్లోనే తనువు చాలిస్తున్నారు. విద్యార్థులంటే కార్పొరేట్ కాలేజీలకు మార్కుల యంత్రాలుగా భావిస్తున్న యాజమాన్యాలు విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి సెక్షన్లుగా విభజించి భయపెడుతున్నాయి. మార్కులను బట్టి సెక్షన్లు మార్చేస్తూ వారిని మానసికంగా వెంటాడుతున్నారు. ఇలా ఆత్మన్యూనతకు లోనయి, కనీసం తన బాధ ఎవరికీ చెప్పుకోలేక చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
కార్పొరేట్ కాలేజీల్లో అదీ ఇంకా నారాయణ, చైతన్యలాంటి కాలేజీల్లో అధ్యాపకులకు బోధనాపద్దతులపై అవగాహన ఉండదు. కనీస వసతులుండవు. ఆటపాట, సాంస్క్కతిక కార్యక్రమాలు, పిక్నిక్ వంటి రీక్రియేషన్ ప్రోగ్సామ్స్ ఉండవు. మాతృభాషలో చదువులుండవు. సైకాలజిస్టులు అందుబాటులో ఉండరు. ఈ విద్యా సంస్థలపై ప్రభుత్వ అజమాయిషీ ఉండదు. వారు ఆడిందే ఆట పాడిందే పాట. అందుకే ఒత్తిడి తట్టుకోలేక స్టూడెంట్స్ చావుకేకలు వేస్తున్నారు.