కర్ణాటకలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా ? బీజేపీకి భంగపాటు తప్పదా ? జేడీఎస్ మూడో స్థానంలో సరిపెట్టుకుంటుందా ? ఇప్పటికే 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి కర్ణాటక ఓటర్లు షాకివ్వనున్నారా ? సిద్ధరామయ్య మరోసారి సీఎం కావడం ఖాయమేనని సీ ఫోర్స్ సర్వేలో తేలింది. గతం ఎన్నికల కంటే ఈ సారి ఓట్ల శాతం పెరుగుతుందని అంచనా వేసింది.
కర్ణాటకలో అధికారం చేపడుదామనుకున్న బీజేపీకి మరోసారి భంగపాటు తప్పదని సీ ఫోర్స్ సర్వే తేల్చింది. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వేలో తేలింది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 112 నుంచి 126 సీట్లు సాధిస్తుందని సీ ఫోర్స్ సర్వే తెలిపింది. ఓటర్ల శాతం కూడా కాంగ్రెస్ పార్టీకి గణనీయంగా పెరగనుంది. 2013లో 119 నుంచి 120 స్థానాలు వస్తాయని సీ ఫోర్స్ చెప్పింది. సర్వేలో వచ్చిన విధంగానే కాంగ్రెస్కు ఎన్నికల్లో 122 స్థానాలు వచ్చాయ్.
తాజాగా సీ ఫోర్స్ అనే సంస్థ మార్చి 1 నుంచి 25 వరకు 154 నియోజకవర్గాల్లో...22వేల 357 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించింది. 326 నగరాలు, 977 గ్రామాల్లో 2వేల 368 బూత్ల పరిధిలో నిర్వహించిన సర్వే నిర్వహించింది సీ ఫోర్స్. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 9శాతం ఓట్లు పెరుగుతాయని అంచనా వేసింది. 2013లో వచ్చిన సీట్ల కంటే ఈ సారి నాలుగు సీట్లు ఎక్కువ వస్తాయని తేల్చింది. 31శాతం ఓట్లతో బీజేపీకి 70 సీట్లు, 16శాతం ఓట్లతో జేడీఎస్కు 27 స్థానాలు వస్తాయని సీ ఫోర్స్ సర్వేలో వెల్లడైంది.
బెంగుళూరు పరిధిలోని 28 అసెంబ్లీ స్థానాల్లో 19 కాంగ్రెస్ పార్టీకే వస్తాయన్న సర్వే పాత మైసూర్ రీజియన్ 33 స్థానాలు కైవసం చేసుకుంటుందని సీఫోర్స్ సర్వేలో వెల్లడైంది. సీఎం సిద్ధరామయ్యకు 45 శాతం మంది జై కొడితే 26 శాతం మంది యడ్యూరప్పకు ఓకే చెబుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ దెబ్బకు మరోసారి బీజేపీ ప్రతిపక్షానికే పరిమితం కానుందని సీ ఫోర్స్ తేలింది.