కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు, రీసెంట్ గా దేశవ్యాప్తంగా వచ్చిన ఉప ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ 2019 ఎన్నికలపై తన వ్యూహరచనను సిద్ధం చేసుకుంటోంది. విడివిడిగా పోటీ చేస్తే భారీ మూల్యం తప్పదని తెలిసొచ్చిన కాంగ్రెస్ వీలైనంత వరకు ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తుపెట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఉమ్మడి శత్రువు బీజేపీని తిరిగి అధికారంలోకి రాకుండా ఉండేందుకు తాము పోటీ చేసే స్థానాలను కూడా భారీగా తగ్గించుకునేందుకు కాంగ్రెస్ సన్నద్దమవుతోంది.
గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 462 స్థానాలకు పోటీచేసి.. 178 చోట్ల డిపాజిట్లను కోల్పోయింది.. కాంగ్రెస్ చరిత్రలో ఇంత భారీ ఓటమి అదే తొలిసారి.. దీని ప్రభావం కాంగ్రెపై నేటికీ ఉంది.. అయితే ఎక్కువ సీట్లలో పోటీచేసి డిపాజిట్లు కోల్పోవడం కన్నా.. బీజేపీకి గట్టి పోటీ ఇవ్వగల ప్రాంతీయ పార్టీలకు మద్దతు పలకడం ద్వారా బీజేపీపై పైచేయి సాధిచవచ్చని భావిస్తోంది కాంగ్రెస్.. ఇక బీజేపీతో ముఖాముఖి పోటీ ఉన్నచోట్ల విజయావకాశాలను పెంచుకోవాలని యోచిస్తోంది.
కర్ణాటకలో జనతాదళ్ ఎస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం.. ఉత్తరప్రదేశ్లోని ఖైరానాకు జరిగిన లోకసభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి బీజేపీని ఓడించడం విపక్షంలో ఆశలను పెంచింది. 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోడీ సారధ్యంలోని బీజేపీ ఒకవైపు, ఇతర పార్టీలు మరోవైపు పోటీచేసే అవకాశాలున్నాయి. మోడీతో ఢీకొని బీజేపీని గద్దె నుంచి దింపాలంటే కలిసికట్టుగా పోటీ చేయడమే సరైన వ్యూహమని దాదాపు అన్ని బీజేపీయేతర పార్టీలు భావిస్తున్నాయి.
ఇందులో భాగంగా చిన్న పార్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు 2019 లోక్సభ ఎన్నికల్లో తక్కువ సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. గత ఎన్నికల్లో 462 సీట్లలో పోటీ చేసిన పార్టీ ఈసారి 400 కంటే తక్కువ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. మోడీ పోటీచేసే వారణాసి లాంటి కొన్ని కీలక స్థానాల్లో కూడా అందరూ కలిసి ఒకే ప్రత్యర్థిని నిలబెట్టాలని అఖిలేశ్ యాదవ్ చేసిన ప్రతిపాదనపై కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.