టీడీపీ-వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం, తోపులాట...వైసీపీ సభ్యుడిని సస్పెండ్ చేసిన మున్సిపల్ చైర్మన్
తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ప్రతిపక్ష వైసీపీ, అధికార టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వాగ్వాదం ముదిరి సభ్యుల తోపులాట చోటు చేసుకుంది. కౌన్సిల్లోని బేంచీలను కింద పడేశారు. దీంతో వైసీపీ సభ్యుడిని మున్సిపల్ చైర్మన్ సస్పెండ్ చేశారు. నిరసనగా మిగిలిన వైసీపీ సభ్యులు కూడా కౌన్సిల్ సమావేశాన్ని వాకౌట్ చేశారు. రణరంగచౌక్ వద్ద ఆగస్టు 15న జెండా ఎగురవేయడం ఆనవాయితీ. అయితే ఆ జెండాను సాయంత్రం అవనతం చేయాలి. కానీ దానిని 365 రోజులు ఉంచుతామని అనడం వివాదాస్పదమైంది. శుక్రవారం కౌన్సిల్ సభలో ఈ అంశంపై చర్చ జరిగింది. వైసీపీ కౌన్సిలర్లు జెండాను సాయంత్రానికి తీసివేయాలని వాదించారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. సభను వాయిదా వేయడంతో గొడవ సద్దుమణిగింది.