అమరావతిలో అరుదైన సన్నివేశం

Update: 2018-06-22 11:34 GMT

వాళ్లిద్దరికీ పరిచయముంది.. దానిని మించిన బంధముంది.. అంతకుమించిన అనుబంధముంది. ఇదంతా 3 నెలల కిందటి వరకే. ఇప్పుడంతా మారిపోయింది. మనుషులు కలిసినా.. మాటల్లేవ్.. పక్కపక్కనే ఉన్నా.. పలకరింపుల్లేవ్.. మాటవరుసకైనా ఓ మాట అనుకోలేదు. నలుగురికోసమైనా నమస్తే పెట్టుకోలేదు.

అమరావతిలో అరుదైన సన్నివేశం జరిగింది. 3 నెలల కిందట షేక్ హ్యాండ్లు, బొకేలు, నవ్వులు, శాలువాలు.. పరస్పరం కప్పుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య.. ఒక్కసారిగా సీన్ రివర్సైంది. తెలిసినా తెలియనట్లు.. కనిపించినా.. కనిపించనట్లు.. పక్కనే ఉన్నా లేనట్లు.. ఎడమొహం, పెడమొహంగా ఉన్నారు. ఈ అరుదైన సన్నివేశానికి.. గుంటూరు జిల్లా నంబూరులో దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వేదికైంది.

దశావతార వెంకటేశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఎదురుపడ్డా.. ఏమీ చూసుకోనట్లు.. ఉన్నారు. మాటవరసకు కూడా మాట్లాడుకోలేదు. పక్కపక్కనే ఉన్నా.. పలకరించుకోలేదు. ఆయనటు.. ఈయనిటూ ఉంటూనే కార్యక్రమంలో పాల్గొన్నారు.

వెంకటేశ్వరస్వామి ఆలయానికి చంద్రబాబు కంటే కాస్త ముందు వెళ్లిన జనసేనాని.. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తర్వాత  వచ్చిన.. బాబు కూడా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పూజ తర్వాత.. పవన్, బాబు ఒకేసారి బయటకు వచ్చినా.. ఒకరి వైపు మరొకరు కనీసం చూసుకోలేదు. బాబు స్ధానికులతో మాట్లాడుతుండగానే పవన్ అక్కడి నుంచే బయటకు వెళ్లిపోయారు. అక్కడున్న టీడీపీ నేతలను కూడా సేనాని పట్టించుకోలేదు.

2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చి.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తనవంతు సహకారం అందించిన పవన్ కల్యాణ్.. కొంతకాలంగా టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. సేనాని వ్యాఖ్యలకు.. టీడీపీ నేతలు కూడా ఎప్పటికప్పుడు గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు. దీంతో.. చంద్రబాబు, పవన్ మధ్య గ్యాప్ బాగానే పెరిగింది.

Similar News