ఇంతకాలం హైదరాబాద్ ను హడలెత్తించిన చెడ్డీ గ్యాంగ్ ఇప్పుడు రాజమహేంద్రవరాన్ని కలవర పెడుతోంది. కొద్ది రోజులుగా హైదరాబాదీలను టెన్షన్ పెట్టిస్తున్న ఈ ముఠా రాజమహేంద్రవరంలో తిష్ట వేసినట్లు సమాచారం. దానవాయిపేట, ప్రకాశ్నగర్ పోలీస్ట్ స్టేషన్ పరిధిలో ఉన్న అర్ధరాత్రి ఓ అపార్టుమెంట్లో ఈ ముఠా చోరీకి యత్నించారన్న వార్తలతో పోలీసులు, స్థానికులు అలర్ట్ అయ్యారు. చెడ్డి బనియన్ ధరించిన కొందరు యువకులు గోడ దూకేందుకు ప్రయత్నించడంతో అప్రమత్తమైన కాపలాదారు పెద్దగా అరవడంతో వారు పారిపోయారు. వాచ్మేన్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
నిక్కర్లు ముఖం కనిపించకుండా మంకీ క్యాప్ వేసుకుని ఉన్నట్లు ఓ అపార్టుమెంట్ వాచ్మేన్ ఇచ్చిన సమాచారంతో చెడ్డీ గ్యాంగ్ గా అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ముఠా సభ్యులు ఉదయం పూట ఆయా ప్రాంతాల్లో బిచ్చగాళ్ల రూపంలో తిరుగుతూ ఇళ్లను టార్గెట్ చేస్తారని పోలీసులు చెబుతున్నారు. ఖరీదైన ఇళ్లను గుర్తించి రాత్రి వేళల్లో ఇళ్లలోకి చొరబడి చోరీలకు యత్నిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దొంగతనాల సమయంలో వీరు తమతో పాటు కత్తులు, రాడ్లు వెంట తెచ్చుకుంటున్నారని చెబుతున్నారు. చోరీలకు పాల్పడుతూ అడ్డు వచ్చిన వారిపై దాడికి పాల్పడేందుకు కూడా వెనుకాడరని..., ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.
చెడ్డీ గ్యాంగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సోషల్ మీడియా, మైకుల ద్వారా అవెర్నేస్ కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు రాత్రి వేళల్లో గస్తీకి ప్రత్యేక బృందాలను నియమించారు.వ్యాపార సంస్థలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడే బిహార్, రాజస్థాన్ ముఠాలతో పాటు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే తమిళనాడు ముఠాలు, మహిళలు, వృద్ధులను ఏమార్చి వారి ఒంటిపై బంగారు ఆభరణాలు అపహరించే ఇరానీ ముఠాల కదలికలు జిల్లాలో కనిపిస్తున్నాయని పోలీసు వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఎవరైనా అపరిచిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు గుర్తిస్తే పోలీస్ కంట్రోల్ రూం నంబరు 100కు ఫోన్ చేయాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.