లలిత్మోడీ, విజయ్ మాల్యా, నీరవ్మోడీ... ఇలా ఆర్ధిక నేరగాళ్లంతా బ్రిటన్లోనే ఎందుకు తలదాచుకుంటున్నారు? వీళ్లంతా బ్రిటన్నే ఎందుకు ఎంచుకున్నారు? భారత్లో నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారంతా... బ్రిటన్కే ఎందుకు చెక్కేస్తున్నారు? నేరగాళ్లకు బ్రిటన్ స్వర్గధామమా? అసలు రీజనేంటి?
లలిత్ మోడీ... విజయ్ మాల్యా.... నీరవ్ మోడీ... ఇలా భారత ఆర్ధిక నేరగాళ్లంతా బ్రిటన్లోనే తలదాచుకుంటున్నారు. ఈ ముగ్గురే కాదు... ఇలా భారత్లో నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఐదారు వేల మంది ఇండియన్స్కి బ్రిటనే... సేఫ్ షెల్టర్గా మారింది. భారత్లో ముప్పు పొంచి ఉన్న వారికి బ్రిటనే సురక్షిత ప్రాంతంగా కనిపిస్తోంది. ఒకవిధంగా చెప్పాలంటే నేరగాళ్లకు బ్రిటన్ స్వర్గధామంగా మారింది.
బ్రిటన్లో మానవ హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేస్తారు. ఎంత పటిష్టంగా ఉంటాయంటే విదేశీయులు ఇక్కడికొచ్చి శరణు కోరితే వాళ్లు కరుడుగట్టిన నేరస్థులైనాసరే తిరిగి ఆయా దేశాలకు అప్పగించేందుకు బ్రిటన్ న్యాయస్థానాలు అంత ఈజీగా ఒప్పుకోవు. ఒకవేళ అప్పగించినా చాలా టైమ్ తీసుకుంటాయి. ఈ తతంగం మొత్తం ముగిసేసరికి తల ప్రాణం తోకకొస్తుంది. అంతేకాదు తిరిగి అప్పగిస్తే వారిని హింసిస్తారేమోనని, లేక మరణశిక్ష అమలు చేస్తారేమోనని బ్రిటన్ కోర్టులు అనుమానిస్తాయి. అంతేకాదు ఏవో రాజకీయ కారణాలతో వారిని అప్పగించమంటున్నారని భావిస్తాయి. ఇలాంటి కారణాలతో ఆయా వ్యక్తులను అప్పగించడం ఆలస్యం చేయొచ్చు లేదా పూర్తిగా నిరాకరించొచ్చు అందుకే భారత ఆర్ధిక నేరగాళ్లంతా బ్రిటన్ను సురక్షిత ప్రాంతంగా ఎంచుకుంటున్నారు.
విజయ్ మాల్యా సహా ఇప్పటివరకు తొమ్మది మందిని తమకు అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం బ్రిటన్ని కోరింది. అయితే నేరస్థుల అప్పగింత ఒప్పందంపై 1992లో భారత్-బ్రిటన్లు సంతకాలు చేశాక... కేవలం ఒక్కరంటే ఒక్క భారతీయుడ్నే... ఇండియాకి అప్పగించింది యూకే. మిగతా అభ్యర్ధనలన్నీ ఇంకా పెండింగ్లో ఉండగా, భారత్ చేసిన అనేక అభ్యర్ధనలను బ్రిటన్ తిరస్కరించింది. అందుకే బడా నేరగాళ్లంతా... తాము పట్టుబడతామనే పొగ వాసన తగలగానే రెక్కలు కట్టుకొని బ్రిటన్ చెక్కేస్తున్నారు.