ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టం అమల్లో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుకు నిరసనగా మంగళవారం బంద్ కు పిలుపునిచ్చింది వైసీపీ. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. జిల్లా కేంద్రాలతో పాటు పలు నగరాల్లో వైసీపీ నేతలు భారీగా తరలివచ్చి బంద్ లో పాల్గొంటున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన సెంటర్లలో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల ఆకాంక్ష, సంజీవని అయిన ప్రత్యేక హోదా కోసం జరిగే ఈ పోరాటంలో అందరూ కలిసి రావాలని జగన్ అన్ని పార్టీలకూ విజ్ఞప్తి చేశారు. కానీ ఏ పార్టీ ముందుకు రాలేదు. అయినా కూడా ఏపీలో బంద్ కొనసాగుతోంది. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న జగన్.. బంద్ సందర్భంగా మంగళవారం పాదయాత్రకు విరామం ప్రకటించారు.