మరో రక్షక భటుడి బండారం బట్టబయలైంది. అక్రమాలకు పాల్పడేవారిని కటకటాల్లో వేయాల్సిన వాడే మహిళలను నమ్మించి మోసం చేస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు. నిత్య పెళ్లి కొడుకుగా మారి ఆడాళ్ల జీవితాలతో ఆడుకుంటున్న హైదరాబాద్ ఆసిఫ్నగర్ స్టేషన్ సీఐ కొలుకపల్లి రాజయ్యను అరెస్ట్ చేసి న్యాయం చేయాలని అతని మూడో భార్య రేణుక డిమాండ్ చేస్తోంది. సూర్యాపేట జిల్లా నారాయణగూడెం గ్రామానికి చెందిన ఇన్స్పెక్టర్ రాజయ్య తొలుత తన మేనత్త కూతురిని, ఆ తర్వాత కోదాడకు చెందిన శ్రీవాణిని పెళ్లి చేసుకుని వదిలిపెట్టాడు. అయితే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచిన రాజయ్య తాండూరుకు చెందిన రేణుక అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలయ్యాక ఆమెపై కూడా వేధింపులకు పాల్పడుతున్నాడు.
తనను, తన పిల్లలను వేధింపులకు గురిచేస్తూ తమ యోగక్షేమాలు పట్టించుకోవడం లేదని రేణుక ఆరోపిస్తోంది. న్యాయం చేయమని అడిగితే అట్రాసిటీ కేసు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం రీటా అనే మరో మహిళతో నాలుగో పెళ్లికి సిద్ధమయ్యాయడని తనకు న్యాయం చేయాలంటూ సరూర్నగర్ మహిళా పోలీస్స్టేషన్లో రేణుక ఫిర్యాదు చేసింది. నాలుగో పెళ్లికి సిద్ధపడ్డ రాజయ్యను కఠినంగా శిక్షించి సర్వీస్ రికార్డుల్లో తనపేరు, తన పిల్లల పేర్లను చేర్చి న్యాయం చేయాలని రేణుక డిమాండ్ చేస్తోంది.