విభజనతో అష్ట కష్టాలు ఒకవైపు... అప్పులభారం మరోవైపు... వెక్కిరించే ఖజనా ఇంకోవైపు. వెంటాడుతున్న రెవెన్యూ లోటు. ఇవన్నీ పక్కనపెడితే హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని అని చెప్పినా.. .తమకంటూ ఓ రాజధానిలేని అగాథమైన స్థితి ఆంధ్రప్రదేశ్ది. ఇదంతా నాలుగేళ్ల క్రితం సంగతి. కానీ ఇప్పుడు అమరావతి రాజధానిగా నవ్యాంధ్ర నవోదయం వైపు అడుగులు వేస్తోంది. అభివృద్ధిలో దూసుకుపోతోంది. ప్రగతిపథాన పయనిస్తోంది.
ఆంధ్రప్రదేశ్.. 13 జిల్లాల ప్రగతి వేదిక. అన్ని రంగాల్లో దేశంలోనే అభివృద్ధిలో దూసుకుపోతోంది. నాలుగేళ్లుగా కేంద్రం అనుకున్నంత సాయం చేయకపోయినా.. ముఖ్యమంత్రిగా తనుకున్న అనుభవం... పరిచయాలే పెట్టుబడిగా చంద్రబాబు సర్కార్ ఏపీని అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి నాలుగేళ్లు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసి నాలుగేళ్లు పూర్తయి ఐదో ఏడులోకి అడుగు పెడుతోంది. విభజన జరిగాక ఎక్కడి నుంచి పాలన చేయాలో తెలియని అయోమయ పరిస్థితి నుంచీ ఏపీని తీరాన పడేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అవడానికి హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానే అయినా... ఇక్కడి నుంచి పాలన చేయడం కష్టంగా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత హైదరాబాద్లోనే ఉంటూ తరుచూ విజయవాడ వచ్చి సమీక్ష సమావేశాలు నిర్వహించేవారు చంద్రబాబు.
ఈ పరిస్థితుల్లో ఏపీకి రాజధాని ఇక్కడా... అని కేంద్రం అప్పటికీ ప్రకటించలేదు. నవ్యాంధ్ర రాజధాని ఎక్కడ పెట్టాలనే దానిపై సీయం చంద్రబాబు పెద్ద కసరత్తే నిర్వహించారు. రాజధానికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు, మంచినీటి వసతులు.. ఒక రాజధానికి ఉండాల్సిన లక్షణాలు.. అవసరాలు... ఇలా అన్ని జిల్లాలకు సెంటర్ పాయింట్గా ఉండాలని చంద్రబాబు భావించారు. అందుకే ఏపీ రాజధానిగా తుళ్లూరు మండలం అమరావతిని ఎంపిక చేశారు. ఇక అప్పటి నుంచి ఏపీ వెనుదిరిగి చూడలేదు.
నవ్యాంధ్ర రాజధానిని మరో సింగపూర్ చేస్తానని చంద్రబాబు ఎన్నికల హమీ ఇచ్చారు.. ఇలాంటి రాజధాని కట్టాలంటే వేల ఎకరాల భూమి కావాలి. అలాంటి భూమిని ఒక్క రుపాయి ఖర్చు చేయకుండా 33 వేల ఎకరాల భూమిని సీఎంపై నమ్మకంతో రైతులు నుంచి మూడంటే మూడు నెలల్లోనే భూ సమీకరణ ద్వారా పూర్తి చేశారు. రాజధానికి అమరావతి అని పేరు పెట్టి.. రాజధానిగా ప్రకటించి అందరి మన్ననలను పొందారు. రాజధాని నుంచి పాలనలో భాగంగా సచివాలయం, అసెంబ్లీ భవనాలను రికార్డ్ స్థాయిలో పూర్తి చేసి, తాత్కాలిక భవనాల నుంచే ఏపీ పాలన సాగిస్తున్నారు. ఇప్పటి వరకు రాజధానిలో దాదాపు కీలకమైన రోడ్లు శరవేగంగా పూర్తయ్యాయి. మొత్తం 45 వేల కోట్ల రూపాయల నిధులను అభివృద్ధి కోసం వినియోగించనున్నారు. మరో 24 వేల కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు సాగుతున్నాయి.