నేటి నుంచి ఏపీలో డీఎస్సీ పరీక్షలు...రెండు దశల్లో ఆన్లైన్ విధానంలో జరగనున్న పరీక్షలు
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్న, అత్యంత కీలకమైన డీఎస్సీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. మొత్తం 125 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 7,902 టీచర్ పోస్టుల కోసం 6,08,159 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఆన్లైన్ విధానంలో రెండు దశల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలి దశ నేటి నుంచి ఈ నెల 30 వరకు, రెండో దశ జనవరి 18 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయి.
తొలి దశకు 2,43,175 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. ఏపీలో 113 కేంద్రాలు, తెలంగాణలో 4, ఒడిసాలో 3, బెంగళూరులో 2, చెన్నైలో 3 కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు.
ఉపాధ్యాయ నియామక పరీక్షలకు 536 మంది దివ్యాంగులు దరఖాస్తులు చేసుకున్నారని, వీరిలో కొందరికి స్కైబ్స్ను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. అయితే, ఈ అభ్యర్థులు మెడికల్ బోర్డు నుంచి పొందిన ధ్రువీకరణ పత్రాన్ని పరీక్ష కేంద్రంలో చూపించాలన్నారు. వీరికి 50 నిమిషాలు అదనపు సమయం ఇస్తామని చెప్పారు. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవాలని అధికారులు సూచించారు. కంప్యూటర్లో లాగిన్ అయ్యేటపుడు ఇబ్బందులు ఎదురైతే నిర్వాహకులకు తెలియజేయాలన్నారు. కంప్యూటర్ మొరాయిస్తే వెంటనే మరో కంప్యూటర్ను ఏర్పాటు చేస్తారని చెప్పారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో 10 కంప్యూటర్లు అదనంగా ఉంచినట్టు తెలిపారు.