శ్రీదేవి మృతిపై చంద్రబాబుకూ డౌటా?

Update: 2018-02-28 11:07 GMT

దిగ్గజ నటి శ్రీదేవి మరణంపై అనేక రకాల అనుమానాలు పొడసూపిన వేళ ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆ ప్రభావంతో కొంత అనుమానాస్పదంగా మాట్లాడారు. తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన ఆ నటికి నివాళిగా నిన్న టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం చంద్రబాబు చంద్రబాబు సహా టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... ఆమె ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడం అరుదైన అంశమని కొనియాడారు. అదే సమయంలో శ్రీదేవి మృతి పట్ల రకరకాల వాదనలు వస్తున్నాయని అన్నారు.

మరోవైపు నిన్న బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అయితే శ్రీదేవి మరణంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెది హత్యేనని ఆయన ఆరోపించారు. శ్రీదేవికి మద్యం తాగే అలవాటు లేదని, అలాంటప్పుడు ఆమె శరీరంలో మద్యం ఆనవాళ్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఎవరైనా బలవంతంగా తాగించారేమో అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఏదేమైనా శ్రీదేవిది సహజ మరణం కాదని ఆయన అన్నారు. 
అయితే.. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సుబ్రహ్మణ్య స్వామి మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా చంద్రబాబు వంటి నేత కూడా ఇలాంటి అనుమానాస్పద వ్యాఖ్యలు చేయడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Similar News