ముందస్తు సమరానికి కాంగ్రెస్ సరికొత్త దళం సిద్దమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లను నియమించగా, మరికొందరికి కీలక బాధ్యతలు అప్పగించింది. అలకమీదున్న విజయశాంతికి, స్టార్ క్యాంపెనర్గా చెలరేగిపోవాలని కర్తవ్య బోధ చేసింది కాంగ్రెస్. పొత్తులు, ఎత్తులు, రాహుల్తో వరుస సమావేశాలతో ముందస్తు దూకుడు పెంచిన టీ. కాంగ్రెస్ నేతలు, యుద్ధానికి సైన్యంగా ఏర్పడ్డారు. పార్టీ వర్గాలు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఎన్నికల కమిటీలను ప్రకటించి, సమరంలో దూసుకెళ్లాలని దిశానిర్దేశం చేసింది ఏఐసీసీ.
కమిటీల వివరాల విషయానికి వస్తే, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లను ఖరారు చేసింది ఏఐసీసీ. 9 అనుబంధ కమిటీలతో పాటు.. 53 మందితో, కో-ఆర్డినేషన్ కమిటీని అపాయింట్ చేసింది. కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా కుంతియా, కన్వీనర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించింది. ప్రచార కమిటీ చైర్మన్గా మల్లు భట్టివిక్రమార్కకు బాధ్యతలు అప్పగించింది. మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్గా దామోదర రాజనర్సింహ, స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ చైర్మన్గా వీహెచ్, ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా మర్రి శశిధర్ రెడ్డి, పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్గా కోదండరెడ్డిని నియమించింది ఏఐసీసీ.
అలాగే, కోర్ కమిటీ సభ్యులుగా కుంతియా, బోస్ రాజు, శ్రీనివాసన్ కృష్ణన్, సలీం అహ్మద్, ఉత్తమ్, భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, రాజనర్సింహ, మధుయాష్కి, చిన్నారెడ్డి, సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి నియమితులయ్యారు. ఇక కొత్త కమిటీలతో ఎన్నికల రణక్షేత్రంలో సత్తా చాటాలని, బాద్యులకు కర్తవ్యబోధ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. విభేదాలు పక్కనపెట్టి, ఐక్యంగా దూసుకెళ్లాలని దిశానిర్దేశం చేసింది.