దేశ రాజదాని ఢిల్లీలో మరో దొంగ బాబా బయటపడ్డాడు. ఆధ్యాత్మిక ముసుగులో దారుణాలు చేస్తున్న మోసగాడి గుట్టు రట్టయింది. అతడి నిర్భంధంలో 41మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్లందరికీ పోలీసులు విముక్తి కలిగించారు. మహిళా కమిషన్ చొరవతో దొంగబాబా నాటకులు వెలుగులోకి వచ్చాయి.
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో వీరేందర్కు చెందిన ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఉంది. ఈ ఆశ్రమంపై గత కొన్నాళ్లుగా ఆరోపణలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున్న సెక్స్ రాకెట్ నడుపుతున్నాడంటూ దీక్షిత్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలతో నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా బంధించిన అమ్మాయిలకు విముక్తి కలిపించారు. ఆయన ఆశ్రమంలో అమ్మాయిల్ని నిర్భంధించి ఉండడాన్ని గమనించారు. అక్కడ భయంకరమైన వాతావరణం పోలీసుల్నే విస్తుపోయేలా చేసింది. బోనుల్లాంటి గదుల్లో అమ్మాయిల్ని బంధించి శారీరకంగా, మానసికంగా హింసిస్తున్న దృశ్యాలు కనిపించాయి. తన గుట్టు బయటపడేసరికి మోసకారి బాబా పారిపోయాడు.
వీరేందర్ ఆశ్రమంలో వేల మంది మహిళలపై ఆకృత్యాలు జరిగినట్టు బాధితులు చెప్తున్నారు. విషయం బయటకు చెప్తే ప్రాణాలు తీస్తానంటూ బెదిరించేవాడని వాళ్లు కన్నీరు పెట్టుకున్నారు. జంతువుల్లా హింసించే వారని ఆవేదన చెందారు. వీరేందర్ దీక్షిత్ ఆశ్రమంలో తాము నరకం చూశామని వాపోయారు. ఎట్టకేలకు అతడి పాపం పండింది. పోలీసుల సహకారంతో మహిళా కమిషన్ 41 మందికి విముక్తి కల్పించింది. పరారీలో ఉన్న నిందితుడు వీరేందర్ దీక్షిత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతన్ని పట్టుకుని.. కటకటాల్లో పడేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు.