మరో కీలక హామీ అమలు దిశగా సీఎం జగన్
మరో కీలక హామీ అమలు దిశగా సీఎం జగన్ మరో కీలక హామీ అమలు దిశగా సీఎం జగన్
ఏపీలో నేటినుంచి మరో ప్రతిష్టాత్మక పధకం ప్రారంభం కాబోతుంది. అదే 'వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం'. సీఎం జగన్ చేతులమీదుగా అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో గురువారం ఉదయం 11.30 గంటలకు కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం కాబోతుంది.. ప్రజలు పౌష్టికాహార లోపం, రక్తహీనతతోపాటు కంటి సమస్యలతో కూడా ఎక్కువగా బాధపడుతున్నారని, వీటిని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంట్లో భాగంగానే వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. కంటి వెలుగు పథకం ద్వారా రాష్ట్రంలో 5.40 కోట్ల మందికి కంటి పరీక్షలతోపాటు అవసరమైన శస్త్రచికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. వైఎస్సార్ కంటి వెలుగులో భాగంగా మొదటి దశలో సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక నేత్ర పరీక్షలు నిర్వహిస్తారు.
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ పరీక్షలు జరుగుతాయి. ప్రపంచ దృష్టి దినం సందర్భంగా అక్టోబర్ 10 నుంచి 16 వరకు ఆరు పనిదినాల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. 160 మంది జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు, 1,415 మంది వైద్యాధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుకు కంటి పరీక్షలకు సంబంధించిన కిట్లను పంపిణి చేశారు. 42,360 మంది ఆశా వర్కర్లు, 62,500 మంది టీచర్లు, 14 వేల మంది ఏఎన్ఎంలు, 14 వేల మంది ప్రజారోగ్య సిబ్బంది అన్ని స్కూళ్లలో జరిగే కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ పధకం ప్రారంభంతో సీఎం జగన్ గతంలో ఇచ్చిన హామీ నెరవేరినట్టయింది.