YSRCP: 27 మంది పేర్లతో వైసీపీ కొత్త ఇంఛార్జ్ల రెండో జాబితా
YSRCP: ఇప్పటివరకు 38 నియోజకవర్గాల్లో మార్పులు
YSRCP: 27 మంది పేర్లతో వైసీపీ కొత్త ఇంఛార్జ్ల రెండో జాబితా
YSRCP: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార పార్టీ వైసీపీ దూకుడు పెంచింది. వైసీపీ ఇన్ఛార్జీల విషయంలో కూడికలు తీసివేతల లెక్కలతో ముందుకు వెళ్తోంది. దీనిపై వైసీపీ అధినేత, సీఎం జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జులను మార్చిన వైసీపీ అధినేత సీఎం జగన్.. రెండో లిస్ట్ 27 స్థానాల్లో ఇన్ఛార్జులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
త్వరలో థర్డ్ లిస్ట్ కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది వైసీపీ అధిష్టానం. దాదాపు 60 స్థానాల్లో మార్పులు చేసేందుకు వైసీపీ నిర్ణయించినట్టు తెలుస్తుండగా.. మరిన్ని మార్పులు ఉంటాయని మంత్రి బొత్స కూడా ప్రకటించారు.
రెండో జాబితాలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించేందుకు వైసీపీ నిర్ణయం తీసుకుంది. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకినాడ ఎంపీ వంగ గీత.. అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ మాధవి.. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ మార్గాని భరత్ను ప్రకటించింది. ఇక అనంతపురం ఎంపీగా శంకరనారాయణ పోటీ చేయనున్నారు. హిందూపురంలో గోరంట్ల మాధవ్ స్థానంలో జోలదరాశి శాంత పోటీ చేస్తారు. అరకు ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవికి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఇచ్చిన అధిష్టానం.. అరకు ఎంపీగా భాగ్యలక్ష్మికి అవకాశం కల్పించింది.
ఇక సెకండ్ లిస్ట్లో పలువురు వైసీపీ సీనియర్ నేతల వారసులకు కూడా ఛాన్స్ దక్కింది. తిరుపతి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి, మచిలీపట్నం నుంచి పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి.. రామచంద్రాపురంలో గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రస్తుతం ఎంపీ పిల్లి సుభాష్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్కు.. చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అవకాశం కల్పించింది.
కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఉష శ్రీ చరణ్కు స్థానచలనం కల్పించింది అధిష్టానం. ఆమె వచ్చే ఎన్నికల్లో పెనుగొండ నుంచి పోటీ చేయనున్నారు. రామచంద్రాపురం ఎమ్మెల్యేగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాల్ను.. రాజమండ్రి రూరల్కు ఇంఛార్జ్గా ప్రకటించారు. విజయవాడ వెస్ట్లో గతంలో పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ను విజయవాడ సెంట్రల్ ఇంఛార్జ్గా ప్రకటించారు.