వైజాగ్ టు బెజవాడ ఐదున్నర గంటల్లోనే.. పట్టాలెక్కిన ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు
విజయవాడ, విశాఖల మధ్య ప్రయాణం మరింత సౌకర్యవంతంగా.. వేగవంతంగా మారింది. ఈ మేరకు గురువారం ఉదయ్ డబుల్ డెక్కర్ రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు రైల్వే సహాయ మంత్రి సురేష్ చన్నబసప్ప అంగడి. విశాఖ స్టేషన్ 1వ నెంబర్ ప్లాట్ ఫాం నుంచి స్పెషల్ ఎక్స్ ప్రెస్ గా ఈరోజు తిరుగుతుంది ఈ రైలు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, గొట్టేడి మాధవి, జీవీఎల్ నర్సింహారావు, రఘురామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేకతలు ఎన్నో.
రెగ్యులర్ రైలుగా వారానికి ఐదురోజులు (ఆది, గురువారం తప్ప) పరుగులు తీయనున్న ఉదయ్ రైలు ప్రయాణీకులకు చాలా సౌకర్యాలను అందిస్తుంది. పూర్తిగా 9 ఏసీ బోగీలతో నడిచే ఈ ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు విశాఖ నుంచి అయిదున్నర గంటల్లో విజయవాడ చేరుకుంటుంది. 22701/22702 ట్రైన్ నంబర్గా విశాఖ నుంచి విజయవాడకు వారానికి 5 రోజుల పాటు ఈ రైలు నడుస్తుంది. అన్ని కోచ్లలో డిస్క్ బ్రేక్లతో పాటు ఫెయిల్యూర్ ఇండికేషన్ బ్రేకింగ్ సిస్టమ్ ఏర్పాటు ఉంది. శతాబ్ది ఎక్స్ప్రెస్ తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో సీటింగ్ ఏర్పాటుతో పాటు ప్రయాణ వేగం, తదుపరి స్టేషన్ వివరాలు తెలిపేందుకు ప్రతి కోచ్లో ఆరు డిస్ ప్లే మానిటర్లు ఏర్పాటు సదుపాయం ఉంటుంది. కోచ్ల్లో ఆటోమేటిక్ టీ, కాఫీ వెండింగ్ మిషన్లు అందుబాటులో ఉంటాయి. ప్రతి మూడో కోచ్ తర్వాత పాంట్రీ, డైనింగ్ సౌకర్యాలు ఉంటాయి. ఇక చిన్న పొగ వచ్చినా వెంటన సమాచారం అందేలా కోచ్లలో వెస్ డా యంత్రాల అమరిక ఉంటుంది. ఈ ట్రైన్ లో ప్రయాణానికి విశాఖ నుంచి విజయవాడకు టికెట్ ధర 525 రూపాయలు.
ఉదయ్ ఎక్కడెక్కడ ఆగుతుందంటే..
ఉదయ్ డబుల్ డెక్కర్ రానూ..పోనూ దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు స్టేషన్లలో ఆగుతుంది.