హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటైన అమెరికా అబ్బాయి-ఆంధ్రా అమ్మాయి
హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటైన అమెరికా అబ్బాయి-ఆంధ్రా అమ్మాయి
ప్రేమకు కులం, మతం, రంగు, ప్రాంతం, భాష లేవని మరోసారి రుజువైంది. అమెరికా అబ్బాయి, ఆంధ్రా అమ్మాయి హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు.విజయవాడ గూడవల్లికి చెందిన గుంటక సత్యహరినాథరెడ్డి, జ్యోతికుమారిల దంపతుల కుమార్తె నాగసంధ్య అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తిచేసింది. దాంతో ఆమెకు ఒరెగాన్లోని ఇంటెల్ కార్పొరేషన్లో టెక్నాలజీలో డెవలప్మెంట్ ఇంజినీర్గా ఉద్యోగం వచ్చింది. కొంతకాలంగా అక్కడే ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు అదే ప్రాంతానికి చెందిన ఎలక్ట్రికల్ ఇంజినీర్ ఆడం బ్యాంగ్తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దాంతో ఇద్దరు కలిసి వివాహం చేసుకోవాలని అనుకున్నారు.
ఈ విషయం ఇరువురు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కూడా పెద్ద మనసుతో వీరి వివాహానికి ఒప్పుకున్నారు. అయితే పెళ్లికూతురు కోరిక మేరకు పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరగాలని పట్టుబట్టడంతో పండితులు కుదిర్చిన ముహర్తం మేరకు మంగళవారం రాత్రి స్థానిక ఏబీ కన్వెన్షన్ సెంటర్లో వీరి వివాహం జరిగింది. వేద మంత్రోచ్ఛారణల నడుమ మూడు ముళ్ల బంధంతో ఆ జంట ఒక్కటయ్యింది. ఈ వివాహానికి వైఎస్సార్ సీపీ గన్నవరం నియోజకవర్గ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.