విశాఖ భూ కుంభకోణం అంతు తేల్చేందుకు సిట్..
గత ప్రభుత్వాల హయాంలో విశాఖ నగరం, సమీప మండలాలు, ప్రాంతాల్లో విచ్చలవిడిగా భూ కుంభకోణాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే దీని అంతు తేల్చాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది
గత ప్రభుత్వాల హయాంలో విశాఖ నగరం, సమీప మండలాలు, ప్రాంతాల్లో విచ్చలవిడిగా భూ కుంభకోణాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే దీని అంతు తేల్చాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా రిటైర్డ్ సీనియర్ ఐఎఎస్ అధికారి డా.విజయ్కుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వైవీ అనురాధ, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి టి.భాస్కరరావులను ప్రభుత్వం నియమించింది. సిట్ బృందం మూడు నెలలపాటు దర్యాప్తు జరపనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం రాత్రి జీవోని విడుదల చేశారు.
కాగా ఈ బృందానికి ప్రభుత్వ, ప్రైవేటు భూముల రికార్డులు, వెబ్ల్యాండ్ ఖాతాలను పరిశీలించే అధికారం ఉంటుంది. వీరు అడిగినప్పుడు సంబంధిత రికార్డులు వీరి ముందు ఉంచాల్సి ఉంటుంది. అలాగే ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తుంది. రికార్డుల ట్యాంపరింగ్ ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతారు. మాజీ సైనికులు, రాజకీయ బాధితులకు ఇచ్చిన భూముల రికార్డులను కూడా పరిశీలించే అధికారం ఉంది.