Dhulipalla Narendra: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో భారీ చోరీ.. 43 సవర్ల బంగారం, 10 కిలోల వెండి మాయం.. క్లూస్ టీమ్ రంగంలోకి!
Dhulipalla Narendra: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ధూళిపాళ్ల ప్రమీలాదేవి నివాసంలో గుర్తుతెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు.
Dhulipalla Narendra: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ధూళిపాళ్ల ప్రమీలాదేవి నివాసంలో గుర్తుతెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. చింతలపూడిలోని ఆమె స్వగృహంలోకి ప్రవేశించిన దొంగలు పెద్ద ఎత్తున నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.
ప్రస్తుతం ప్రమీలాదేవి గుంటూరులో తన కుమారుడు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇంట్లో ఉంటున్నారు. చింతలపూడిలోని ఇల్లు ఖాళీగా ఉండటాన్ని గమనించిన దొంగలు, లోపలికి చొరబడి బీరువాలను పగులగొట్టారు. సుమారు 43 సవర్ల బంగారం, 10 కేజీల వెండి వస్తువులతో పాటు రూ. లక్ష నగదును అపహరించుకుపోయారు.
చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన ప్రమీలాదేవి వెంటనే పొన్నూరు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఎస్సై శ్రీహరి బాధితురాలి ఇంటిని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరించింది.
ఎమ్మెల్యే తల్లి నివాసంలోనే అంత భారీ స్థాయిలో చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపింది. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ చోరీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఎస్సై తెలిపారు.