ఆపరేషన్ రాయల్ వశిష్ట ముగిసిన అధ్యాయమే? ఎందుకంటే..
ఆపరేషన్ రాయల్ వశిష్ట ముగిసిన అధ్యాయమే? ఎందుకంటే..
గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును వెలికితీయడం మరింత కష్టతరంగా మారింది. నాలుగు రోజుల నుంచి జరుగుతున్న వెలికితీత పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.. ప్రస్తుత పరిస్థితుల్లో బోటును బయటకు తీయడం అసాధ్యమే అన్న భావన కలుగుతోంది. ధర్మాడి సత్యం బృందం చేసిన అన్ని విఫలమయ్యాయి. కచ్చులూరు ప్రాంతంలో రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. దీనికి తోడు తగ్గిందన్న వరద మళ్ళీ పోటెత్తుతోంది. దీంతో నాలుగోరోజు బోటు వెలికితీత పనులు నిలిపివేశారు. అధికారుల నుంచి కూడా అనుమతి లభించలేదు. దీంతో నాలుగో రోజు బోటు వెలికితీత పనులకు బ్రేక్ పడింది.
బాలాజీ మెరైన్స్ సంస్థ 22 లక్షల 70 వేలకు బోటును పైకి తీసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.. ఒక క్రేన్, పొక్లెయిన్, 2వేల మీటర్ల వైర్ రోప్, 2 లంగర్లు, 10 జాకీలతోపాటు ఇంకొన్ని భారీ తాళ్లు, సామాగ్రిని కలిగి ఉన్నా ఆ ఆపరేషన్ దాదాపు ముగిసినట్టే కనిపిస్తోంది. 250 అడుగుల లోతులో ఇసుకలో కూరుకుపోయిన బోటును బయటకు తీసుకురావడంలో బాలాజీ మెరైన్స్ సంస్థ విఫలమైంది. దీనికి కారణం బోటుకు లంగర్ వేస్తుంటే బండరాళ్ళకు తగిలి తెగిపోతోంది. మరోవైపు వేగంగా వస్తున్న వరదతో రోప్ కదిలిపోతుండడంతో ఆపరేషన్ కష్టమైంది. కాగా సెప్టెంబర్ 15న ప్రమాదం జరిగింది. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. 36 మృతదేహాలను బయటకుతీశారు. మిగతా 14 మంది కోసమే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.