ప్రియుడి కోసం అందరిని ముప్పుతిప్పలుపెట్టిన బాలిక

తన ప్రేమికుడిని పంపిస్తే గానీ ఇంట్లో బంధించిన కుటుంబ సభ్యులను వదలనంటూ ఓ బాలిక వెర్రి వేషాలు వేసింది. దీంతో నాలుగు గంటలపాటు పోలీసులు, అధికారులకు ముప్పుతిప్పలు

Update: 2019-10-25 02:37 GMT

తన ప్రేమికుడిని పంపిస్తే గానీ ఇంట్లో బంధించిన కుటుంబ సభ్యులను వదలనంటూ ఓ బాలిక వెర్రి వేషాలు వేసింది. దీంతో నాలుగు గంటలపాటు పోలీసులు, అధికారులకు ముప్పుతిప్పలు పెట్టింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో చోటుచేసుకుంది. పలమనేరు నాగులురాళ్లువీధికి చెందిన ఓ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వీరి చిన్నమ్మాయి ( మైనర్‌)గత ఏడాడి ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతుండగా పలమనేరుకు చెందిన కొరియర్‌ బాయ్‌ రెహమాన్‌ను ప్రేమించింది.. దాంతో ఇటీవల అదృశ్యమైంది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెహమాన్‌పై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కుమార్తె ప్రేమ వ్యవహారంపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమెను కాలేజీకి పంపకుండా ఇంటివద్దే ఉంచారు. ఈ క్రమంలో రెహమాన్‌ మళ్లీ ఆ వీధిలో తిరగడం మొదలెట్టాడు.

ప్రేమికుడిని గమనించిన బాలిక గురువారం సాయంత్రం ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులను బయటకు రాకుండా తాళం వేసింది. అనంతరం వారి మీద కోపంతో గట్టిగా అరుస్తూ.. హల్చల్ చేసింది. ఆ తరువాత కుటుంబసభ్యులు చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ.. పోలీసులకు ఫోన్ చేసింది. దీంతో పట్టణ సీఐ, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఐసీడీఎస్‌ సిబ్బందితో కలసి ఆ ఇంటికి వచ్చారు. ఇక్కడికి వచ్చి చూసిన పోలీసులకు అసలు సీన్ అర్ధమైంది. దాంతో తాము బాలికకు న్యాయం చేస్తామని చేప్పినా ఖాతరు చేయకుండా తనకు ప్రియుడే ముఖ్యమంటూ, తల్లిదండ్రులు ఏడాదిగా వేధిస్తున్నారని వారిపైనా కూడా తిట్ల పురాణం అందుకుంది. పోలీసులు, ఐసీడీఎస్‌ సిబ్బంది ఎంత బ్రతిమిలాడినా ఆ బాలిక బయటకు రాలేదు.తన లవర్‌ రెహమాన్‌ వస్తేగానీ రానంటూ కేకలు వేసింది. ఇంతలో బాలిక తండ్రి వచ్చి నేను నీకు అండగా ఉంటానంటూ బాలికను బయటకు రప్పించాడు. బాలిక స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకున్న అధికారులు బాల్య వివాహాలు చట్టవిరుద్ధమంటూ బాలికకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మైనార్టీ తీరేదాకా తిరుపతి జువనైల్‌ హోమ్‌కు తరలించాలని ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు. తమ కుమార్తెను తాము వేధించడం లేదని.. ప్రేమ దోమ అంటూ చదువు మానేసి రెహమాన్ వెంట వెళుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  

Tags:    

Similar News