ఏపీలో భారీవర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం భారీ వర్షాలు కురిశాయి. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం భారీ వర్షాలు కురిశాయి. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 133.6 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. భారీవర్షాలకు విజయనగరం రైల్వేస్టేషన్ యార్డులో వరదనీరు నిలిచిపోయింది. దీంతో ట్రాక్ సర్క్యూట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నీటిని బయటకు పంపి ట్రాక్ క్లియర్ చెయ్యాలంటే ఒక్కరోజైనా పడుతోంది. అంతేకాకుండా మరో రెండు రెండు రోజులు భారీ వర్షాలు పడతాయన్న కారణంతో పలు రైళ్లను రద్దు చేసినట్టు తూర్పు కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. విశాఖలో గురువారం బయలుదేరాల్సిన విశాఖపట్నం-బెర్హంపూర్ పాసింజర్ (58526),
శుక్రవారం బెర్హంపూర్- విశాఖపట్నం పాసింజర్ (58525), విశాఖలో గురువారం బయలుదేరాల్సిన విశాఖపట్నం-భువనేశ్వర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్(22820), శుక్రవారం భువనేశ్వర్లో బయలుదేరాల్సిన భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్(22819) రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే జగదల్పూర్-భువనేశ్వర్ హీరఖండ్ ఎక్స్ప్రెస్ (18448)ను రీషెడ్యూల్ చేశామని స్పష్టం చేశారు. మరోవైపు విశాఖ జిల్లా కొత్తవలస–కిరండూల్ రైల్వేలైన్లో కొండచరియలు జారిపడ్డాయి. బొర్రా–చిమిడిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య కొండచరియలు రైల్వే విద్యుత్ లైన్పై పడటంతో మంటలు రేగాయి.