Visakhapatnam: జిల్లాలో 1254 దుకాణాలు తనిఖీ... 406 కేసులు నమోదు: కలెక్టర్
విశాఖపట్నం: కోవిడ్-19 (కరోనా) మహమ్మారిని అరికట్టే చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగం జిల్లాలో 1254 దుకాణాలను తనిఖీ చేసి 406 కేసులు నమోదు చేసినట్లు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, తూనికలు కొలతలు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసు శాఖల వారిచే ప్రతిరోజు దుకాణాలను తనిఖీ చేసి అధిక ధరలు, తక్కువ తూకం మొదలైన వాటిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు 16 తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
శుక్రవారం 25 బృందాలు తనిఖీలలో పాల్గొన్నాయని 300 దుకాణాలను తనిఖీ చేసి 86 కేసులను నమోదు చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు తూనికలు కొలతల శాఖ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ 685 దుకాణాలను తనిఖీ చేసి 272 కేసులు నమోదు చేశారన్నారు. జీవీఎంసీ, ఎలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలలో 569 దుకాణాలను తనిఖీ చేసి 5 కేసులు నమోదు చేయగా పోలీసు శాఖ వారు 124 కేసులు నమోదు చేశారని వెల్లడించారు.