ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి సీజేగా జస్టిస్ జేకే మహేశ్వరి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి సీజేగా జస్టిస్ జేకే మహేశ్వరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి సీజేగా జస్టిస్ జేకే మహేశ్వరి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జితేంద్ర కుమార్ నియామకానికి ఆమోదముద్ర వేశారు. అలాగే గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇకనుంచి పూర్తిస్థాయి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ జితేంద్ర కుమార్ కొనసాగుతారని కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీజేగా జస్టిస్ మహేశ్వరి నియామకం అమల్లోకి వస్తుందని కేంద్రం తన నోటిఫికేషన్లో పేర్కొంది. మధ్యప్రదేశ్ హైకోర్టులో నంబర్ టూ స్థానంలో ఉన్న జస్టిస్ మహేశ్వరిని పదోన్నతిపై ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించేందుకు సిఫారసు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన తెలిసిందే. దీనికి ప్రధాని, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో జస్టిస్ మహేశ్వరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ప్రస్తుతం దసరా సెలవులు ఉన్నందున ఆయన ప్రమాణస్వీకారం తేదీ ఖరారు కాలేదు. గత 9నెలలుగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే)గా వ్యవహరిస్తున్నారు. జస్టిస్ మహేశ్వరి 1961 జూన్ 29న జన్మించారు. 1985 నవంబర్ 22న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2005 నవంబర్ 25న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తరువాత 2008లో హైకోర్టు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు సీజేగా ఎంపికైన ఆయన 2023 జూన్ 28న పదవీ విరమణ చేయనున్నారు.